నారాయణపేటటౌన్, సెప్టెంబర్ 21: దళితబంధు లబ్ధిదారులు వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయ్కుమార్ సూచించారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్లో దళితబంధు లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లబ్ధిదారులు యూనిట్లను ఏవిధంగా వినియోగించుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు అమలు చేస్తుందని, లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే నిధులు జమచేసినట్లు చెప్పారు. లబ్ధిదారులు మోటర్ వెహికిల్స్కు ప్రాధాన్యత ఇవ్వకుండా పౌల్ట్రీ, వ్యవసాయ అనుబంధ పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్నారు. పెండెల్స్, ఆయుర్వేదిక్ ప్లాంట్స్, డెయిరీ, ఫిషరీస్ప్లాంట్స్ పెట్టుకోవచ్చాన్నారు. దళితబంధు కోసం ప్రత్యేకంగా యాప్ను ఏర్పాటు చేశామని, ఇబ్బందులు ఉన్నవారు యాప్ ద్వారా సలహాలు, సూచనలు పొందవచ్చన్నారు. అనంతరం కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన వారికి దళితబంధు అందించడం జరిగిందని, సఫ్లయర్స్, ఫర్టిలైజర్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టడం జరిగిందని, రైతుబంధు ద్వారా చాలామంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ దళితబంధు సలహాదారులు ఆనంద్, ఎల్డీఎం విజయ్కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
పాఠశాలల్లో ఏర్పాటు చేసిన లైబ్రరీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిచందన సూచించారు. అంకురం ప్రాజెక్టు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నారాయణపేట విద్యాశాఖ, జాయ్ ఆఫ్ రీడింగ్, అలోకిత్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జిల్లాలోని 20ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేశారు. బుధవారం పట్టణంలోని శివాజీనగర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీని విద్యార్థుల ద్వారా రిబ్బన్ కట్ చేయించి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల్లో పఠన అలవాట్లను పెంపొందించుకునేందుకు గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పిల్లలు నేర్చుకునే స్థాయిని బట్టి ప్రతి పాఠశాలకు 100 పుస్తకాలు అందజేస్తారని చెప్పారు. లైబ్రరీ పీరియడ్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు స్వచ్ఛంద సంస్థలు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తాయన్నారు. ఫైలట్ ప్రాజెక్టు విజయవంతంగా అమలు చేస్తే మరిన్ని పాఠశాలలకు విస్తరిస్తారన్నారు. అనంతరం వంటగదిని తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఈవో గోవిందరాజులు, జిల్లా సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్, అలోకిత్ సంస్థ సహ వ్యవస్థాపకుడు సాయిప్రమోద్, జాయ్ ఆఫ్ రీడింగ్ బోర్డు సభ్యులు హరిణిరాఘవన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
నారాయణపేట, సెప్టెంబర్ 21: ఈ నెల 25నుంచి బతుకమ్మ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. బుధవారం టెలీకాన్ఫరెన్స్లో వేడుకలపై పలు సూచనలు చేశారు. గతేడాది మాదిరిగానే ఈ సారి బతుకమ్మ సంబురాలను పట్టణంలోని బారంబావి వద్ద జరుపుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ముందురోజు అన్నిశాఖలు పాల్గొనాలని, మరుసటి రోజు నుంచి రోజుకో శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించాలన్నారు. బారంబావి వద్ద పరిసరాలను శుభ్రం చేయించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అన్నిశాఖలు సమన్వయంతో వేడుకలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్డీవో గోపాల్నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.