మహబూబ్నగర్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు సంబురం కొనసాగుతున్నది. రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయడం ప్రారంభమైన తర్వాత సోమవారం నాటికి ఉమ్మడి జిల్లాలో 8,57,693 మంది రైతుల ఖాతాల్లో రూ.852,62,35,627 జమ కాగా.. మంగళవారం ఆరో రోజున కూడా రైతు ఖాతాల్లో పంటసాయం వచ్చి చేరింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33,536 మంది రైతుల ఖాతాల్లో రూ.88,89,35,743 జమయ్యాయి. దీంతో మంగళవారం నాటికి ఉమ్మడి జిల్లాలోని 8,91,229 మంది రైతులకు రూ.941,51,71,370 పంట సాయం అందింది. కేవలం ఆరు రోజుల్లో ఇంత పెద్ద మొత్తం పంట సాయం అందడంపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో రైతులకు కనీసం చిల్లిగవ్వ ఇవ్వని ప్రభుత్వాలుండే పరిస్థితి నుంచి వేల కోట్ల రూపాయలు పంట పెట్టుబడిగా ఉచితంగా సాయం అందించే ప్రభుత్వం ఉండడం తమ అదృష్టంగా రైతులు పేర్కొంటున్నారు.
కొనసాగుతున్న సంబురాలు..
రైతులు, అధికారులు రైతుబంధు వారోత్సవాల్లో పాలుపంచుకుంటున్నారు. బుధవారం, గురువారం పాఠశాలల్లో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. శుక్ర, శనివారాల్లో డీఆర్డీఏ, మహిళా సంఘాల సహకారంతో ముగ్గుల పోటీలు, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9న కోడెల ప్రదర్శన, 10వ తేదీన ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖాధికారులు తెలిపారు. విజేతలకు క్లస్టర్ స్థాయిలో బహుమతులు అందించనున్నారు.