అమ్రాబాద్, మే 21 : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బైక్లను చోరీ చేసి నకిలీ ఆర్సీలు సృష్టించి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం అమ్రాబాద్ పోలీస్స్టేషన్లో ఎస్సై సద్దాం హుస్సేన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మనోహర్ వివరాలు వెల్లడించారు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాధవానిపల్లి గ్రామానికి చెందిన ఎలిశెట్టి సత్యనారాయణ, నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన శారగొండ మహేశ్తో కలిసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన, తాళాలు వేసిన ఇండ్లల్లో ఉన్న బైక్లను దొంగిలించేవారు.
ఆ బైక్లకు నకిలీ ఆర్సీలను తయారుచేసి తక్కువ ధరకు విక్రయించేవారు. ఈ నెల 18న అమ్రాబాద్ మండలం కొత్తపల్లి గేటు వద్ద ఎస్సై వాహనాలు తనిఖీ చేస్తుండగా.. సదరు వ్యక్తులు బైక్ను ఆపకుండా పారిపోయారు. దీంతో అనుమానం వచ్చిన ఎస్సై సీసీ కెమెరాలను పరిశీలించారు. సత్యనారాయణ, మహేశ్ బైక్లను దొంగిలిస్తున్నట్లు గు ర్తించి రంగంలోకి దిగారు. నిందితులను అదుపులోకి తీసుకొని 44 బైక్లను చోరీ చేసినట్లు తెలుసుకున్నారు. వాటిలో 27 వాహనాలు ఎల్మపల్లి, కొత్తపల్లి, మొల్కమామిడి, కల్ములోనిపల్లి తదితర గ్రామాల్లో రికవరీ చేశారు. మిగిలిన వాహనాలు నల్లగొండ, రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్, మహబూబ్నగర్లో ఉన్నాయని, వా టిని కూడా త్వరలోనే రికవరీ చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. సత్యనారాయణ గతంలో 18 నెలలపాటు జైలుశిక్ష అనుభవించాడన్నారు. తాజాగా 379 సెక్షన్ క్రైమ్ నంబర్ 63/22 కింద సత్యనారాయణ, మహేశ్కు సహకరించిన రామకృష్ట, వెంకటేశ్, ఆంజనేయులుపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. రెండో సారి వాహనాల చోరీకి పాల్పడడంతో సత్యనారాయణపై పీడీయాక్ట్ నమోదు చేస్తామన్నారు. కేసును ఛేదించిన ఎస్సైలు సద్దాంహుస్సేన్, తిరుపతిరెడ్డి, సీఐ ఆదిరెడ్డి, సిబ్బందిని అభినందించారు. రివార్డులు అందజేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో డీఎస్పీ కృష్ణకిశోర్, పోలీస్ సిబ్బంది నజీర్, రామకృష్ణ, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.