రక్త సంబంధానికి సమానంగా.. అంతకంటే ఎక్కువగా ఆత్మీయ అనుబంధాన్ని పంచేది స్నేహితులే.. అందుకే అద్వితీయం.. వర్ణించలేని భావం.. వెన్నంటే నిలిచే ఆపన్నహస్తం.. భాషలేని ఓ బంధం, ఆత్మీయతకు ప్రతిరూపం.. అందుకే ‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’.. ‘దోస్త్ మేరా దోస్త్’.. అంటూ నిర్వచించాడో కవి. తల్లిదండ్రులు, తోబుట్టువులు లేని వారు ఉంటారు కానీ.. దోస్తానా లేని జీవితాలు ఉండవు.. మంచిని పంచుతూ భాషలేని బంధంగా, ఆత్మీయతకు ప్రతిరూపంగా నిలుస్తున్నది. అందుకే రానురాను స్నేహాలు మరింత పెరిగాయి. సమాచార విప్లవం రాకతో కొత్త స్నేహాలు చిగురిస్తూనే ఉంటాయి.
బాలానగర్, ఆగస్టు 6: ఏటా ఆగస్టు మొదటి ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం నిర్వహించుకోవాలని యూఎన్వో ప్రకటించింది. హాల్మార్క్ కార్డ్ వ్యవస్థాపకుడు జోయన్హల్ 1919లో మొదటి సారి ఫ్రెండ్షిప్ డే గురించి ప్రస్తావించాడు. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అందరూ గ్రీటింగ్ కార్డులు, శుభాకాంక్షలు చెప్పుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాతే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ గ్రీటింగ్ కార్డుల సంస్థ స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించడం మొదలు పెట్టిందని చెబుతారు. మరికొంత మంది స్నేహం అనే గొప్ప అనుభూతిని సంబురంగా మార్చుకోవాలన్న ఆలోచనలోంచి పుట్టిందే స్నేహితుల రోజని, 1935లో యూనైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. ఈ ఆనవాయితీని ప్రపంచం అంతా కొనసాగిస్తోందని మరికొందరు చెబుతారు.
స్నేహం కూడా అంతా ఆన్లైన్లో..
ప్రస్తుత స్నేహాలు యాంత్రికతమవుతున్నాయి. కమ్యూనికేషన్ పెరిగినా కలుసుకోవడం అరుదు అవుతోంది. స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో చాటింగ్, వీటన్నింటి ద్వారా వెళ్తున్న స్నేహ ప్రవాహం, స్నేహితులలో కలిసిన వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్లతోనే ప్రతిరోజు ఒకరికొకరు పలకరించుకుంటున్నారు. దీంతో నిత్యం స్నేహితులు ఒకరికొకరు కలుసుకోవడం ద్వారా కలిగే అపురూప అనుభూతిని దూరం చేసుకుంటున్నారు. అనుభూతి, భావోద్వేగాలపరంగా చూసుకున్నా..స్నేహాలు వర్ధిల్లాలంటే మిత్రులను కలవాలని మానసిక శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
స్నేహానికి ప్రతీక శ్రీకృష్ణుడు, కుచేలుడు
పురాణ ఇతిహాసాలలో స్నేహబంధం గురించి ఎంతో గొప్పగా మన పూర్వీకులు చెప్పారు. మన మందరం ఎంతో గొప్పగా కొలిచే శ్రీ కృష్ణ భగవానుడికి కుచేలుడనే ప్రాణ స్నేహితుడు ఉండేవాడని పురాణల్లో పేర్కొన్నారు. శ్రీ కృష్ణుడు కుచేలుడు కలిసి సాందీవుడనే గురువు వద్ద చదువుకున్నారు. ఆ సమయంలో చిగురించిన స్నేహం కలకాలం నిలిచింది. ఎన్నో కష్టాలు ఉన్న కుచేలుడు తన స్నేహితుడైన శ్రీ కృష్ణుడుడి వద్దకు వచ్చి తన పేదరికం చెప్పుకోవడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోతాడు. శ్రీ కృష్ణుడు అది గమనించి తన స్నేహితుని కష్టాలు తీరుస్తాడు. అందుకే ప్రతి ఒక్కరికీ శ్రీ కృష్ణుడి లాంటి స్నేహితుడు ఉండాలని చెబుతుంటారు.