స్నేహం ఎంతో మధురం.. కుటుంబ బంధాలకంటే ఉన్నతం.. ఇలా ఎంతగా వర్ణించినా.. అంతకంటే గొప్పదనం.. బాల్యం నుంచి మొదలైన చెలిమి జీవితాంతం కలిసి సాగడం అదృష్టం.. బతుకు బాటలో ఈ బంధానికి మించింది లేదు.. ఇది నిజంగా అరుదు.. అంతటి మహోన్నత దోస్తానా.. కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా వెన్నంటే నిలుస్తుంది. ఏతోడు లేకున్నా.. చేదోడుగా నిలిచేది కూడా అదొక్కటే.. అలాంటి స్నేహాభావాన్ని చాట డంలో నేటి తరం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. సోషల్ మీడియా వేదికగా నాటి స్మృతులను నెమరేసుకుంటూ పూర్వ విద్యార్థులు నిత్యం పలుకరించుకుంటున్నారు. నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా కథనం..
ఆత్మకూరు, ఆగస్టు 5 : ‘స్నేహ బంధము.. ఎంత మధురము.. చెరిగిపోదు.. తరిగిపోదు జీవితాంతమూ’ అని మనసు కవి ఆత్రేయ తన మాటల్లో స్నేహనికున్న గొప్పతనాన్ని వివరించారు. పంచదార కన్నా, పట్టుతేనె కన్నా తీయనిది స్నేహం. భేషజాలు, బంధాలను విడదీసినా స్నేహ కుసుమాలు వికసిస్తూనే ఉంటాయి. వసుదైక కుటుంబ వారధిగా పరిమళాలను వెదజల్లుతూనే ఉంటాయి. స్నేహానికి ఎల్లలు లేవు, ఈ సామ్రాజ్యం విశ్వమంతా వ్యాపించి ఉంది. చీకటి కాలాలు.. అసూయాద్వేషాలు.. హద్దులు, అరమరికలు లేనిదే స్వచ్ఛమైన స్నేహం. యుగాల కాలం నుంచి మానవ సంబంధాల్లో స్నేహం పదిలంగానే ఉంది. అందుకు కుచేలుడు, శ్రీకృష్ణుని స్నేహం గురించి చెప్పవచ్చు.
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అన్న సినీ కవి మాటలు అక్షరాల నిజం. రక్తం పంచుకుపుట్టిన వారి మధ్యగానీ భార్యాభర్తల మధ్య గానీ ఉండని ప్రేమాభిమానాలు స్నేహితుల మధ్య ఉంటాయని చెప్పడం అతిశయోక్తి కాదు. జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి.. వాటిని అన్నదమ్ములు, తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, చివరికి భార్యతో కూడా చెప్పలేం.. కానీ స్నేహితులతో పంచుకుంటాం. అందుకే స్నేహబంధం ఎంతో మధురం. ఒక వ్యక్తి యొక్క స్నేహితులను చూసి అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు. స్నేహం మనిషి నిగ్గుతేల్చే గీటురాయి. ఉమ్మడి కుటుంబాల రోజుల్లో ఇంట్లో మొగ్గతొడిగిన స్నేహపూర్వక వాతావరణం సమాజంలో మనిసి మంచితనానికి ఎదుగుదలకూ దోహదం చేసేది. కాలానుగుణంగా చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. భార్యాభర్తలిద్దరూ సంపాదించాల్సిన పరిస్థితులు వచ్చాయి.
ఈక్రమంలో తోటివారితో స్నేహితులమనే భావం బలపడుతూ వచ్చింది. అనుభవైకవేద్యమైన తియ్యని జ్ఞాపకాల దొంతరే స్నేహం. ఆ స్నేహాన్ని పరస్పరం పంచుకునేందుకు ఏర్పాటుచేసిందే ఫ్రెండ్షిప్ డే. వాస్తవానికి ఈ సంప్రదాయం పాశ్చాత్య దేశాలదే అయినా.. స్నేహానికి ఎల్లలు లేవన్నట్లుగా అది మనదేశంలో కూడా విస్తృతంగా వ్యాపించింది. ఎంతటి సంతోషాన్నైనా, ఎటువంటి బాధనైనా చెప్పుకొనేది ఒక్క స్నేహితుడికే అన్నది జగమెరిగిన సత్యం. ఆ స్నేహం కోసం కొందరు ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడుతుంటారు. స్నేహానికి లింగబేధం లేదు. అది ఇద్దరు మగవాళ్లు లేదా ఆడ, మగ మధ్య అయినా ఉండొచ్చు ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు. కానీ స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చేవారెందరో ఉన్నారు. ఎవరికి వారైపోతున్న ప్రస్తుత యాంత్రిక జీవితంలో ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా.. ఫ్రెండ్షిప్ డేను ఆప్యాయత, అనుబంధాలు కలబోసుకొని జరుపుకొంటుంటారు. తమ స్నేహానికి గుర్తుగా స్నేహితులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి సంబురం చేసుకుంటారు. అన్నాతమ్ముళ్ల బంధానికి ‘రాఖీ’ పండుగలా స్నేహితుల బంధానికి ఈ ‘ఫ్రెండ్షిప్ బ్యాండ్’ ప్రతీకగా నిలుస్తుంది.
సరికొత్త ట్రెండ్..
స్నేహమంటే నమ్మకం.. ఆసరా.. బాధ్యత.. అవగాహన.. అనురాగం ఇలా చెప్పుకుంటూ పోతే అంతులేని అర్థాలెన్నో వస్తాయి. స్నేహానికి మించిన బహుమతి ఈ లోకంలో మరొకటి ఉండదు. సృష్టిలో అన్నింటికన్నా తియ్యనైనది స్నేహమొక్కటే. రక్తసంబంధాన్ని సైతం మరిపించే అద్వితీయ బంధం. అందుకే స్నేహితుల కోసం ప్రాణమిచ్చే మిత్రులు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. అలాంటి స్నేహాన్ని ఎన్నడూ వీడకూడదంటూ సరికొత్త ట్రెండ్ను కొనసాగిస్తున్నారు నేటి యువత. మనిషి ఎంత ఎదిగినా చిన్ననాటి స్నేహితులు, టీనేజ్ స్నేహం ఎన్నటికీ మరిచిపోలేనిది. అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకునేలా నేటి యువత సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎంత బిజీ లైఫ్ గడుపుతున్నా స్నేహితులతో నిత్యం టచ్లో ఉంటూ తమ స్నేహబంధాన్ని అన్యోన్యంగా నిలుపుకొంటున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరిట ఏడాదికోసారి కలుసుకొని మధురానుబూతులను పంచుకోవడం, తాము చదువుకున్న పాఠశాలలు, కళాశాలలకు ఎంతో కొంత మేలు చేస్తున్నారు. చదువు చెప్పిన గురువులను సన్మానించుకుంటున్నారు. అదే
విధంగా స్నేహితులందరూ వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసుకొని నిత్యం టచ్లో ఉంటున్నారు. ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో దోస్తుల గ్రూపు లేదంటే అతిశయోక్తిగా చెప్పాల్సిందే. ఆనందంలో, బాధలో, ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకోవడమే కాకుండా, తోడ్పాటునందించడంలోనూ ముందుంటున్నారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందించి తమ సహృదయాన్ని చాటుకుంటూ స్నేహ బంధాన్ని నిలుపుకొంటున్నారు.
‘ఆ త్మీయ’ స్నేహాలు..
ఎప్పుడో కలిసి చదువుకుని 30 ఏండ్లకు నెరిసిన జుట్టుతో కలుస్తున్నాం. కొందరు అవ్వాతాతలు కూడా అయ్యారు. మరికొందరు బిడ్డ, కొడుకుల పెండ్లిళ్లు కూడా చేసేశారు. బతుకుబండిలో ఏం సాధించామని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ బరువులు, బాధ్యతలే కనిపిస్తాయి. కుటుంబ పోషణ, సంసార సాగరం, ఉద్యోగ బాధ్యత, వ్యాపార లావాదేవీలు, ఇలా ఎన్నో ఆటుపోట్ల నడుమ నలిగిపోతున్న జీవితం. వీటన్నింటినీ కాసేపు పక్కనపెట్టి స్నేహితుల సాన్నిహిత్యంలో గడిపితే లభించే ప్రశాంతతే వేరు. చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహితులందరూ ఒక్కొక్కరూ ఒక్కో ఊరు, రాష్ట్రం, దేశాల్లో జీవనం సాగిస్తున్న రోజులు ఉన్నాయి. ఇలాంటి పూర్వ విద్యార్థులందరూ ఆత్మీయ సమ్మేళనాల పేరిట కలుసుకొని అపూర్వకలయికతో స్నేహ బాంధవ్యాలను నిలుపుకొంటున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకొని ఆహ్లాదంగా గడుపుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒకేచోట కలుసుకొని ‘అరేయ్’, ‘ఒరేయ్’, ఏరా అంటూ చిన్నప్పుడు పిలుచుకునే ఊతపేర్లతో పిలుచుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికల పేరిట సాగుతున్న ఈ ట్రెండ్ స్నేహితుల కలయికలకు కొత్త ఒరవడిని తీసుకొచ్చింది.
వాట్సాప్ గ్రూపుల్లో నిత్యం టచ్లోనే..
నేటి ఆధునిక సమాజంలో మారిన పరిస్థితులను బట్టి సామాజిక మాధ్యమాల జోరు సాగుతోంది. స్నేహ మాధుర్యానికి చిహ్నంగా బ్యాచ్ల పేరిట, పాఠశాలల పేరిట, గొప్ప గొప్ప అర్థాలు వచ్చేలా, వారి స్నేహాన్ని చాటుకునేలా వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసుకొని దోస్తులతో నిత్యం టచ్లో ఉంటున్నారు. బర్త్డేలు, పెళ్లి రోజులు, తమ పిల్లల పుట్టినరోజులను గ్రూపుల్లో పోస్ట్ చేసి అందరి ఆశీస్సులు కోరడం, శుభాకాంక్షలు చెప్పడం ట్రెండింగ్గా మారింది.
మొక్కవోని స్నేహం
మూసాపేట, ఆగస్టు 4 : చదువుతున్నప్పుడు మొదలైన స్నేహం నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నది. వారిరువురి మధ్య ఎలాంటి బంధుత్వం లేకపోయినా 1983లో మహబుబ్నగర్లో చదువుకునే రోజుల్లోనే స్నేహం ఏర్పడింది. మహబూబ్నగర్లో కలిసిన వారు మహారాష్ట్రలో ఇంజినీర్ పూర్తి చేశారు. నాటి నుంచి నేటి వరకు ఎలాంటి మనస్పర్థలు లేకుండా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిలో ఒకరు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కాగా మరొకరు అడ్డాకుల జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్రెడ్డి. వారిద్దరూ చదువు పూర్తి చేసిన తర్వాత ఏవీఆర్ (ఆల వెంకటేశ్వర్రెడ్డి) పేరుతో కాంట్రాక్టు పనులు మొదలు పెట్టారు. తర్వాత ఇద్దరికి పెండ్లిళ్లు అయ్యాయి. అనంతరం ఆల భూత్పూర్లో జెడ్పీటీసీగా గెలుపొంది రాజకీయ ప్రవేశం చేశారు. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి పనిచేశారు. ఆల ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలిచేందుకు రాజశేఖర్రెడ్డి శ్రమించారు. ప్రస్తుతం అడ్డాకుల జెడ్పీటీసీగా ఉన్న రాజశేఖర్రెడ్డి ఆలకు హ్యాట్రిక్ అందించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారు. వారి స్నేహంపై దేవరకద్ర నియోజకవర్గ నాయకులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ స్నేహితులు అంటే ఇలా ఉండాలని అనుకుంటున్నారు.
25 ఏండ్లకు కలిశాం..
1994-96 బ్యాచ్లో ఇంటర్ చదువుకున్నాం. ఆ తర్వాత ఒక్కసారి కూడా కలవలేదు. 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఒకొక్కరి ఫోన్ నంబర్లు సేకరించి గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నాం. ఏడాదికోసారి దోస్తులందరం కలుస్తున్నాం. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసుకొని ప్రతిరోజూ పలుకరించుకుంటున్నాం. ఎవరికి ఆపద వచ్చినా తోడుగా ఉంటున్నాం. వ్యాపార రీత్యా ఎంత బిజీగా ఉన్నా దోస్తులతో అప్పుడప్పుడూ మాట్లాడుకుంటే ఆ ఆనందమే వేరు. పదవి, హోదా, స్థాయిలను మరిచి మిత్రులతో చాట్ చేస్తుంటే కలిగే సంతోషం ఎన్ని కోట్లు పెట్టినా కొనలేం.
– తిరుపతిరెడ్డి, వ్యాపారస్తుడు, ఆత్మకూరు
ఎప్పుడూ టచ్లోనే ఉంటాం..
ఫ్రెండ్స్తో ఆన్లైన్లో ఎప్పుడూ టచ్లోనే ఉంటాం. పెండ్లిళ్లు అయ్యాక ఒక్కొక్కరం ఒక్కోచోట ఉంటున్నాం. ఉద్యోగం, కుటుంబ బాధ్యతల్లో నిమగ్నమై నిరంతరం టెన్షన్ లైఫ్ అనుభవిస్తుంటాం. కాసేపు స్నేహితులతో మాట్లాడితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా స్నేహితులకు ప్రతిరోజూ గుడ్మార్నింగ్ చెప్పడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం, పండుగ పబ్బాలకు విష్ చేయడం బాగా అలవాటైంది. ఎలాంటి బాధల్లో ఉన్నా గ్రూపుల్లో ఫ్రెండ్స్ పెట్టే ముచ్చట్లు, జోకులు, పంచ్లు చూస్తూ వాటినిమర్చిపోతాం.