కోడేరు, మే 8 : తక్కువ పెట్టుబడితో లక్షలు ఎలా సంపాదించాలను కుంటున్నారా.. అయితే మీరు కోడేరుకు తక్కువ ధరలో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి రంగులతో కూడిన ఓ బోర్డును పెట్టండి. ఆ తరువాత సంబంధిత గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధికి కొందరు అవినీతి పరులైన అధికారుల జేబులు నింపండి ఆ తరువాత స్థానికంగా పేరున్న నాయకుడి ఆశీస్సులు పొంది ఆయన చేతనే రిబ్బన్ కటింగ్ చేయిస్తే సరీ.. మీ పంట పండినట్లే దీని పేరే రియల్ ఎస్టేట్ దందా.. మండల కేంద్రంలో గత ఆరేండ్ల కాలం లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో ఉన్న ధరలకన్నా వందరేట్లు అధికంగా పెరిగిపోయాయి. ఆరేండ్ల కిందట రూ.10 వేలకు వచ్చే ప్లాటు ఇప్పుడు లక్షలకు తక్కువ దొరకడం లేదు. కారణం సులువుగా అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధ్దంగా లేఅవుట్లను ఏర్పాటు చేసి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఎలాంటి లేఅవుట్లు వేయకుండానే ప్లాట్లను విక్రయి ంచి సొమ్ము చేసుకుంటున్నాడు. గ్రామ చుట్టూ ఆయన పొ లాలే ఉండటంతో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటం గమనార్హం.
విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు
గడిచిన ఆరేండ్ల కాలంలో కోడేరు చుట్టూ రియల్ వెంచర్లు వెలిశాయి. 20నుంచి 25 వేల ఎకరాల వ్యవసాయ సాగు భూములను ప్లాట్లుగా మార్చి దాదాపు రూ.10 కోట్ల మేర వ్యాపారం చేశారు. రైతులతో తక్కువ ధరలకు కొనుగోలు చేయడం వెంటనే వాటిని ప్లాట్లుగా మార్చేయడం విక్రయించటంతో ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి పడుతున్నది.
అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు
వెంచర్లకు గ్రామ పంచాయతీ రెవెన్యూశాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలి. ముఖ్యంగా గృహనిర్మాణ స్థలాలుగా చేసేటప్పుడు తప్పనిసరిగా పట్టణ లేదా గ్రామ ప్రణాళిక అధికారితో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో అంతర్గత రహదారుల్లో వాహనాల రాకపోకలకు 30 ఫీట్ల రహదారి పదిశాతం భూమిని సంబంధిత గ్రామ పంచాయతీకి ప్రజాప్రయోజనాల కోసం ఇవ్వాలి. మురుగుకాల్వల నిర్మాణాలను కూడా ముందుగానే ఏర్పాటు చేయాలి. తాగునీటి వసతి, విద్యుత్సౌకర్యం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. లేఅవుట్లకు రెండేండ్ల కాలపరిమితి దాటిన తరువాత అందుకు సంబంధించి ఫీజును చెల్లించాలి. కాని ఇవేవి జరగడం లేదు. కేవలం సంబంధిత గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులను కొందరు అధికారులను మచ్చిక చేసుకొని వారి జేబులు తడుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. యథేచ్చగా వెంచర్లను ఏర్పాటు చేస్త్తూ అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధితశాఖ అధికారులు గాని గ్రామ పంచాయతీ అధికారులు గానీ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలి
కోడేరులో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా అక్రమ వెంచర్లు వేసి అధిక ధరలకు ప్లాట్లను విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పేదలతో లక్షల రూపాయలను దోచుకుంటున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేట్టాలి.
-బద్దుల శేఖర్, కోడేరు
అనుమతులు తప్పనిసరి
అనుమతులు లేకుండా లేఅవుట్లు నిర్మాణాలు వేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. దీనిపై ఆర్ఐలు, కావలికార్లు ఇతర సిబ్బందితో విచారణ చేయించి అక్రమవెంచర్లు ఉన్న వారిని గుర్తించి అనుమతులు తీసుకునేలా చర్యలు తీసుకుంటాం.
-తాసీల్దార్,మల్లికార్జున్రావు