మహబూబ్ నగర్ : కరివెన రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా నల్లమట్టి ( Black soil ) తరలింపులో అవినీతి చేశాడని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేస్తున్న తప్పుడు ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం దేవరకద్రలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లమట్టిలో అవినీతి చేయలేదని కురుమూర్తి స్వామి ( Kurumurthy Swamy ) సాక్షిగా చెబుతున్నానని వెల్లడించారు.
రిజర్వాయర్లు కట్టాలంటే కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి అవసరం వుంటుంది.చెరువుల్లో మట్టి తీసి రిజర్వాయర్ నిర్మించాం. చెరువుల్లో నీటి నిల్వ పెంచినం.మిషన్ కాకతీయలో చెరువుల్లో మట్టి తీస్తే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చామని పేర్కొన్నారు.కురుమూర్తి స్వామి దగ్గరికి వెళ్లినల్లమట్టి అమ్ముకోలేదని ప్రమాణం చేస్తాను. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని బాండు పేపర్లు రాసి సంతకం పెట్టావా? లేదా అక్కడికి వెళ్లి మరోసారి ప్రమాణం చేద్దాం.. దేవుడు ఎవరు శిక్షిస్తాడో చూద్దామంటూ సవాల్ విసిరారు.
నీ పని తీరు మీద నమ్మకం ఉంటే రాజీనామా చేసి పోటీ చేయాలి.నువ్వు గెలిస్తే ఎమ్మెల్యే గా మరోసారి పోటీ చేయనని ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రకటించారు.బీఆర్ఎస్ హయాంలో కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 11 గ్రామాలకు సాగునీరు అందించామని,పెద్ద వాగు,ఊక చెట్టు వాగుల మీద 36 చెక్ డ్యాంల నిర్మాణం చేసిరెండు వాగులను సజీవంగా ఉంచినామని పేర్కొన్నారు.అతి తక్కువ ఖర్చుతో బండర్ పల్లి వద్ద చెక్ డ్యామ్ నిర్మించామని వెల్లడించారు.
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి న్యాయవాద తెలివిని అక్రమ కేసులు,సెక్షన్లు, ఎఫ్ ఐ ఆర్,ఛార్జ్ షీట్లపై శ్రద్ధ పెట్టి ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నాడని ఆరోపించారు. నియోజకవర్గంలో జోరుగా ఇసుక దందా జరుగుతుందని స్పష్టం చేశారు.కూకట్పల్లిలో ఏం చేస్తున్నావో తెలుసని, బాష మార్చుకో పోతే వీడియోలు, ఫోటో లు బయటికి వస్తాయని హెచ్చరించారు.