రాష్ట్రంలో పటిష్టమైన పోలీస్ వ్యవస్థ, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో నేరాల అదుపులో తెలంగాణ నెంబర్వన్గా నిలిచిందని హోం శాఖ మంత్రి మహమూద్అలీ తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, డీజీపీ అంజనీకుమార్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, మల్టీ జోన్-2 ఐజీ షాహనవాజ్ ఖాసీం, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, చిట్టెం రామోహ్మన్రెడ్డితో కలిసి మంత్రి మహమూద్ అలీ మంగళవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ మహిళలకు షీటీమ్స్తో భద్రత కల్పిస్తున్నామన్నారు. మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ను ప్రజలకు దేవుడు ఇచ్చిన బహుమతిగా అభివర్ణించారు. మన రాష్ట్రంలోని సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు ఐకాన్గా నిలిచాయన్నారు. కేసీఆర్ అధికారం కోసం పార్టీ పెట్టలేదని, ప్రజల బాగోగుల కోసమే బీఆర్ఎస్ను స్థాపించినట్లు తెలిపారు.
– వనపర్తి/వనపర్తి టౌన్, మే 30
వనపర్తి/వనపర్తి టౌన్, మే 30 : శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ నెంబర్వన్గా నిలిచిందని, పోలీసు వ్యవస్థపై ప్రజలకు భ రోసా కల్పిస్తున్నట్లు హోం శాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. మంగళవా రం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ భవనాన్ని మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, డీజీపీ అంజనీకుమార్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, మల్టీ జోన్-2 ఐజీ షానవాజ్ ఖాసీం, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనా న్ని స్వీకరించారు. అనంతరం ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహమూద్ అలీ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఎంతో నమ్మకం పెరిగిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు పోలీసులంటే భయం కాకుండా భరోసా కల్పించేలా అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతూ తక్షణమే న్యాయం చేకూరుస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా నేరాల అదుపు కోసం 64శాతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని అన్నారు.ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ, మహిళల రక్షణ కోసం షీటీం, మూఢ నమ్మకాలపై కళాజాత బృందం ద్వారా అవగాహన కార్యక్రమాలు, ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా ప్రతి సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీస్ శాఖకు 2013-14లో 6వేల మంది సిబ్బంది ఉండగా, ప్రస్తుతం 9,600 సిబ్బందిని నియమించారని, దీంతో పాటు మండల, పట్టణ, జిల్లా స్థాయి పోలీస్స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు గుర్తుచేశారు.
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం వందేండ్ల భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఎన్నో ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నారని.. ప్రజలకు గాడ్ గిఫ్ట్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. రాష్ట్ర సచివాలయం మాదిరిగా దేశంలో ఏ రాష్ర్టాల పరిపాలన భవనాలు లేవని తెలిపారు. ప్రతి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను నూతనంగా నిర్మించి ప్రజలకు అన్ని సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వనపర్తి సంస్థానాదీశుల కాలంలో ఏర్పాటు చేసిన రాజభవనం ఐకాన్గా ఉండగా, ప్రస్తుతం కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు మరో ఐకాన్గా మారాయన్నారు. రాజగారి బంగ్లా (ప్రస్తుత పాలిటెక్నిక్ కళాశాల)ను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. 250 ఎకరాల్లో మెడికల్ కళాశాల, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, కోర్టులు, విద్యాలయాలు ఒకే చోట ఏర్పాటయ్యాయన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఇక్కడి వసతులు, బోధన చూసి ఆశ్చర్యానికి గురై మెచ్చుకుంటున్నారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
దేశంలోనే నెంబర్వన్ పోలీసు వ్యవస్థ : డీజీపీ అంజనీకుమార్
శాంతి భద్రతల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. సీఎం కేసీఆర్, హోం శాఖ మంత్రి మహెమూద్ అలీ సహకారంతో ఇప్పటికే సీసీ కెమరాల ఏర్పాట్లు, షీ టీంలు, భవిత కేంద్రాలను ఏర్పాటు చేసి పోలీసు వ్యవస్థ ముందడుగు వేసిందన్నారు. ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. వ్యవసాయం గురించి ఒకప్పుడు పాఠ్య పుస్తకంలో చదవుగా, ప్రస్తుతం తెలంగాణలోని వ్యవసాయాన్ని చూస్తే పండుగలా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి పోలీస్స్టేషన్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు.
దేశం కేసీఆర్ వైపు చూస్తుంది : పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్
దూరదృష్టి కలిగిన సీఎం కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేస్తున్నారని, ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూసి దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. సీఎం కేసీఆర్ పోలీసు వ్యవస్థ పటిష్టం కోసం అన్ని పోలీస్స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీని మంత్రి నిరంజన్రెడ్డితో పాటు స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ రక్షితా మూర్తి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ ఆనంద్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ , వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్ జయసుధ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.