జడ్చర్ల నవంబర్ 26 : జడ్చర్ల పట్టణంలోని అక్రమార్కులు అడ్డూఅదుపు లేకుండా ఇసుక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. తెల్లవారిందం టే చాలు నంబర్ ప్లేట్లు లేని ఇసుక ట్రాక్టర్లు ద ర్శనమిస్తున్నాయి. ఏకంగా పోలీస్స్టేషన్, తాసిల్దార్ కార్యాలయం ముందు నుంచే ఇసుక ట్రా క్టర్లు నడుస్తున్నా.. అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జడ్చర్ల మండలం అల్వాన్పల్లి వాగు, పోలేపల్లి, ఈర్లపల్లి గ్రా మాల నుంచి నుంచి అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నారు.
అందినకాడికి కాసులు దోచుకుంటున్నారు. పోలేపల్లి, ఈర్లపల్లి గ్రామాల వాగులో నుంచి టిప్పర్లు, లారీల్లో.., అల్వాన్పల్లి వాగు నుంచి ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. నిత్యం ఇసుక ట్రాక్టర్లు జడ్చర్ల పట్టణ రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఈ తతంగమంతా బహిరంగంగా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాహన నిబంధనల మే రకు ప్రతి వాహనానికి నంబరు ప్లేట్ కచ్చితం గా ఉండాలి.
కానీ, ఇసుక అక్రమ రవాణా చే స్తున్న ట్రాక్టర్లకు ఎలాంటి నంబర్ ప్లేట్లు లేవు. నంబర్ ఉంటే ట్రాక్టర్లను పట్టుకుంటారన్న ఉద్దేశంతో అక్రమార్కులు కొత్తపంథా ఎంచుకున్నారు. దీనికితోడు రహదారుల మీదుగా అతివేగంగా రాంగ్రూట్లలో ట్రాక్టర్లను నడిపిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా ట్రాక్టర్లకు సంబంధించిన ప త్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఉండడం లే దు.
కొందరు వ్యాపారులు ప్రభుత్వ పనులకు ఇసుకను తరలిస్తున్నామంటూ.. ప్రైవేటు వ్యాపారం చేసుకుంటున్నారు. పట్టణంలో నూతనంగా నిర్మాణమవుతున్న భవనాలకు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. వాస్తవానికి భవన నిర్మాణాలకుగానూ ప్రభుత్వ ఫీజు చెల్లించి అధికారుల అనుమతి మేరకు రవాణా చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడేమీ అలాంటి నిబంధనలు పాటించడంలేదు. వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.