ఉమ్మడి పాలమూరు జిల్లాను వారం రోజులుగా ముంచేసిన ముసురు తెరిపినిచ్చింది. ఇప్పటికే కురిసిన వర్షంతో వా గులు, వంకలు ఉధృతంగా పారుతుండగా.. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. రహదారులు కోతకు గురికాగా.. కుంట కట్టలు దెబ్బతిన్నాయి. మొత్తం 120 పాత, మట్టి మిద్దెలు కూలిపడ్డాయి. అయితే నష్టం జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. దీంతో ఉన్నతాధికారులు కిందిస్థాయి ఉద్యోగులను, పో లీసులను అప్రమత్తం చేశారు. ప్రాజెక్టులు, వాగుల వద్దకు సందర్శకులకు అనుమతి నిరాకరించారు. కూలిన ఇండ్ల వద్దకు తాసీల్దార్లు చేరుకొని పునరావాస చర్యలు చేపట్టారు. పాత ఇండ్లు, నదులు, వాగుల తీరప్రాంతాల్లో ఉంటున్న వారిని సురక్షిత ప్రాం తాలకు తరలించి వారికి దుస్తులు, భోజనం ఏర్పాటు చేశారు.
గ్రామాల్లో వర్షంపై టాంటాం వేశారు. ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు పారుతున్న వాగులు దాటొద్దని సూచించడంతోపాటు రాకపోకలను నిలిపివేశారు. కాజ్వేలు, వంతెనల వద్ద పోలీసులు, అధికారులు గస్తీ కాశారు. చెరువులు, వాగులు, వంకల వద్ద అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లారు. నదీతీర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నారాయణపేట కలెక్టర్ కోయశ్రీహర్ష, ఎస్పీ వెంకటేశ్వర్లుతో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఫోన్లో మాట్లాడారు. వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సమీక్ష నిర్వహించి అధికారులను అలర్ట్ చేశారు. జడ్చర్లలో కూలిపోయిన ఇండ్లను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, దుందుభీ నది ఉధృతిని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పరిశీలించారు.
మహబూబ్నగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎడతెరిపి లేకుండా ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అప్రమత్తతతో వ్యవహరిస్తుండడంతో ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కలెక్టర్లు, ఎస్పీలు సంయుక్తంగా అధికార యంత్రాంగంతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగం ఎక్కడికక్కడే అధికారులను, పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.
ఇండ్లు కూలిన వారికి ఆయా మండల తాసీల్దార్లు పునరావాస చర్యలు చేపట్టారు. గ్రామాల్లో వర్షంపై టాంటాం వేస్తూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న వాగులపై రాకపోకలు నిలిపివేశారు. కాజ్వేలు, వంతెనలపై వరద వస్తున్న ప్రాంతాల్లో రహదారులను మూసివేసి పోలీసులు, రెవెన్యూ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. రహదారులు దెబ్బతిన్న ప్రాంతాల్లోకి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్సైలతోపాటు మండల స్థాయి అధికారులు, పోలీసులు గ్రామాల్లో పర్యటిస్తూ జాగ్రత్తలను ప్రజలకు సూచిస్తున్నారు. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకుండా నిషేధించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జురాల, దుందుభీ, కోయిల్సాగర్ ప్రాజెక్టుల వద్ద సందర్శకుల అనుమతిని రద్దు చేశారు. జురాలకు భారీ వరద వస్తున్న నేపథ్యంలో కృష్ణానది పరీవాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు.
కూలిన ఇండ్లు.. నిలిచిన రాకపోకలు..
ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో పాత ఇండ్లు కూలిపోయాయి. అన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు సుమారు 102 ఇండ్లు కూలినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇండ్లు కూలిపోయిన వారందరికీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పునరావాసం కల్పిస్తున్నారు. గ్రామాల్లో అధికారులు పర్యటిస్తూ వర్షాల వల్ల వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. చెరువులు, వాగులు, వంకల వద్ద అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం చిప్పదొడ్డి వద్ద వాగుపై ఉన్న రహదారి కోతకు గురికావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
అలంపూర్ మండలం క్యాతూర్లో గోడ కూలి 20 గొర్రెలు మృతిచెందాయి. ఊట్కూర్ మండలం అమీన్పూర్ వద్ద వాగును నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని సంజీవయ్య కాలనీలో కూలిపోయిన ఇండ్లను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. మిడ్జిల్ మండలం వెలుగొమ్ముల-క్యాతూర్ మధ్య దుందుభీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు రెండు గ్రామాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద వరద రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అయిజ పట్టణంలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉప్పునుంతల మండలంలో దుందుభీ నది ఉధృతిని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మహబూబ్నగర్ పట్టణంలో మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా రాత్రింబవళ్లు సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి, ఖిల్లాఘణపురం మండలాల్లో భారీ వర్షాలు పడడంతో వాగులు పారుతున్నాయి. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం ఎన్మోనిపల్లి, కంసాన్పల్లి రహదారిపై వరద చేరడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. మక్తల్ మున్సిపాలిటీలో కూలడానికి సిద్ధంగా ఉన్న పాత ఇండ్లలో నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కృష్ణానదికి భారీ వరద వస్తున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు. జడ్చర్ల మండలం అల్వాన్పల్లి వద్ద మీనాంబరం వాగువద్ద వరద ఉధృతిని డీఎస్పీ మహేశ్, సీఐలు పరిశీలించారు. రాజాపూర్ మండల కేంద్రంలో రైల్వే అండర్బ్రిడ్జిలో నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల నేపథ్యంలో అధికారులు, పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమిక్షించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.