నాగర్కర్నూల్, మే 10 : ఎండాకాలంలో చేపల పెంపకంలో తగు జాగ్రత్తలు పాటిస్తేనే ఎదుగుదల సాధ్యపడుతుంది. జిల్లాలో మత్స్యకారులు చెరువులు, కుంటల్లో చేపలపెంపకం చేస్తున్నారు. వేసవిలో చేపలపెంపకం ఎంతో కీలకం. అధిక ఉష్ణోగ్రతతో ఎక్కువ చేపల సాంద్రత ఉండడం, నీరు క్రమేపీ తగ్గడం, కలిగి ఉన్న ప్రాణవాయు వు కొరత, నీటి నాణ్యత తగ్గిపోయి ఘారాత పెరగడం వంటి కారణాల వల్ల చేపలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయని నాగకర్కర్నూల్ జిల్లా మత్స్యశాఖాధికారి డాక్టర్ లక్ష్మప్ప వెల్లడించారు. ఈ సందర్భంగా వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కొన్ని సందర్భాల్లో పెద్ద మొత్తంలో చేపలు చనిపోతూ ఉంటాయని, రోగ కారక సూక్ష్మజీవుల వల్ల వ్యాధులు సంభవించే అవకాశాలు కూడా ఎక్కువవుతాయన్నారు.
– చెరువులోని నీటి నాణ్యత, లోతు, విస్తీర్ణం, చేపల కదలికలు ప్రతిరోజూ గమనిస్తూ ఉండాలి. చెరువులోని కొన్ని చేపలను మచ్చుకు పట్టి వాటి పెరుగుదల, రంగు, తోక, రెక్కల స్వభావం, మొడ్పలరంగు, పై జిగురు వంటి లక్షణాల ను నిశితం గా పరిశీలించాల్సి ఉంటుంది. తేడా గమనించిన తరువాత సంబంధిత మత్స్యశాఖాధికారి సలహా లు, సూచనలు తీసుకొని నివారణ, నియంత్రణ చర్యలు సత్వరమే చేపడితే ఆర్థికనష్టాన్ని కొంతమేరకు తగ్గించవచ్చు.
ఉదయాన్నే చేపలు చెరువుపైభాగాన నోరు తెరుచుకొని తిరుగుతూ ఉంటే ప్రాణవాయువు కొరత ఉందని గమనించాలి. అలాంటి సందర్భాల్లో చెరువులో నీరుపెట్టడం, అది సాధ్యంకాని పక్షంలో పెద్దగా పెరిగిన చేపలను పట్టి అమ్మడం చేయాలి. దీనివల్ల చేపల సాంధ్రత తగ్గడం వల్ల ప్రాణవాయువు కొరతను అధిగమించవచ్చు. కానీ మత్స్యకారులు చేపలు మార్కెట్ సైజు రాలేదనో లేదా మార్కెట్లో ధర తక్కువగా ఉందనో, ఐస్ దొరకకపోవడం వంటి కారణా ల వల్ల నిర్లక్ష్యం చేయడం సరికాదు.
– చెరువులో నీటి నాణ్యత తగ్గిపోయినప్పుడు సున్నాన్ని ఒక హెక్టారుకు 100 నుంచి 250 కేజీల వరకు చెరువులో చల్లినట్లయితే నీటి నాణ్యత పెరగడమే కాకుండా ప్రాణవాయువు శాతం పెరిగి ఉదజని సూచకను అదుపులో ఉంచనుంది.
చెరువులోని కలుపు మొక్కలని ఎప్పటికప్పుడు తగ్గిస్లూ ఉండాలి. లేకుంటే రాత్రి సమయాల్లో అవి కేవలం కార్బన్డయాక్సైడ్ను విడుదల చేయడం వల్ల చేపలు తీవ్ర ప్రాణవాయువు కొరత వల్ల ఎక్కువ మొత్తంలో చనిపోతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మత్స్యకారులు ఎవరైనా గిట్టని వారు విషం కలిపారని అనుమానిస్తూ ఉంటారు. విషం కలిపినట్లయితే మనం పెంచే కర్పూజాతి చేపలే కాకుండా కొర్రమట్ట, మార్పు, జెళ్లలు, వంటివి తక్కువ ఆక్సిజన్ ను తట్టుకునే చేపలు, కప్పలు, నీటిపాములు కూడా చనిపోవాలి. కనుక అటువంటి అనుమానాలు నిజమాకాదా అని నిర్ధారణ చేసుకోవడం చాలా అవసరం.
వ్యాధితో చేపలు చనిపోయినప్పుడు వెంటనే తొలగించి చెరువుకు దూరంగా కాల్చివేయాలి లేదా ఒక గోతి తీసి అందులో పూడ్చి వేయాలి. వెంటనే సున్నాన్ని ఒక హెక్టారుకు 100 నుంచి 250 మోతాదులో చల్లాలి. ఇంకా అదుపులోకి రాకుంటే నీటి నాణ్యత పెంచే రసాయనాలైన బీకేసీ (బెంజాల్ కొలియం క్లోరైడ్)ను ఒక హెక్టారుకు లీటరు చొప్పున నీటిలో కలిపి చెరువులో చల్లాలి. దీంతో నీటి నాణ్యత పెరగడమే కాకుండా చేపలపై పరాన్న జీవులు చనిపోతాయి.
ప్రాణవాయువును పెంచుకోవడానికి చెరువులోని నీటిని మోటర్ల ద్వారా రీసైక్లింగ్ చేసుకున్న తరువాత విషవాయువులు తగ్గి ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. ఆయా సందర్భాల్లో చేపలను పట్టివేయడం అత్యంత శ్రేయస్కరమని జిల్లా మత్స్యశాఖాధికారి లక్ష్మప్ప సూచించారు.