మక్తల్ టౌన్, మే 2 : సీఎం కేసీఆర్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతున్నది. ఈ క్రమంలో చదువునే నమ్ముకొని, విద్యాబుద్ధులు నేర్పుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారి ఎన్నో ఏండ్ల కల నెరవేరింది. కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులర్ ఉద్యోగులుగా మారునుండడంతో వారి జీవితాల్లో ఆనందం అవధులు లేకుండా పోయింది. తమ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి అడుగడుగునా క్షీరాభిషేకాలు చేస్తున్నారు. జూనియర్ కళాశాలల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, విద్యార్థులకు చక్కటి విద్యను అందించాలనే లక్ష్యంతో 2002లో అప్పటి సర్కార్ కాంట్రాక్ట్ లెక్చరర్లను నియమించింది. పని చేయించుకున్నా.. వారికి తగిన వేతనం ఇవ్వలేకపోయింది. తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా భాగస్వాములు కావడంతో అప్పట్లోనే ఉద్యమ నేత కేసీఆర్ స్వరాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థకు చరమగీతం పాడుతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టారు. క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశాన్ని ఆమోదించి, లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తూ 2016 ఫిబ్రవరి 26న జీవో-16ను విడుదల చేశారు. అయితే, కొంతమంది ప్రతిపక్ష నేతలు నిరుద్యోగులను రెచ్చగొట్టి కోర్టుకెళ్లి క్రమబద్ధీకరణను నిలిపివేయించారు. ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలన్న తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచి లాభం చేకూర్చింది. ఈ క్రమంలో గత నెల 30వ తేదీన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలోని 5 వేల పై చిలుకు ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఫైల్పై సంతకం చేయడంతో ఉద్యోగుల్లో ఆనందోత్సవాలు వెల్లువెత్తాయి. కాగా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 417 మంది జూనియర్ లెక్చరర్లు క్రమబద్ధీకరణతో లబ్ధి పొందనున్నారు. నారాయణపేట జిల్లాలో 70, మహబూబ్నగర్ జిల్లాలో 123, జోగుళాంబ గద్వాలలో 47, నాగర్కర్నూల్లో 96, వనపర్తిలో 81 మంది లబ్ధి పొందనున్నారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటా..
ఎన్నో ఏండ్లుగా క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వ జూనియ ర్ కళాశాలలో ఒప్పంద పద్ధతిలో విధు లు నిర్వర్తిస్తున్న లెక్చరర్లను రెగ్యులర్ చేస్తూ సీఎం కేసీఆర్ ఫైల్పై సంతకం చే యడం ఆనందంగా ఉన్నది. తమను రె గ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ప్రభుత్వానికి రుణపడి ఉం టాం. సీఎం కేసీఆర్ మా జీవితాల్లో వె లుగులు నింపారు. విద్యార్థుల జీవితాలను ఇంకా చక్కదిద్దుతాం.
– రాజు, లెక్చరర్, మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల
క్రమబద్ద్ధీకరణతో వెలుగులు..
2008లో ఒప్పంద లెక్చరర్గా ఉద్యోగంలో చేరాను. గత ప్రభుత్వాలు తమను రెగ్యులర్ చేస్తామని ఆశలు రేపి పబ్బం గడిపారే తప్పా మా బాధలను పట్టించుకోలేదు. ఇచ్చిన మాట ప్రకారం రెగ్యులర్ చేస్తూ సీఎం కేసీఆర్ మా జీవితాల్లో వెలుగులు నింపారు. ముఖ్యమంత్రిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం.
– శ్రీధర్రెడ్డి, లెక్చరర్, తాడూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల