జోగుళాంబ గద్వాల, నారాయణపేట వాసులకు మెడి‘కల’ నెరవేరింది. గతంలో ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. రెండు జిల్లాల్లో వైద్య కాలేజీలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభంకానుండగా.. రెండు జిల్లాలు మెడికల్ హబ్గా మారనున్నాయి. సర్కారు దవాఖానల్లో వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానుండగా.. పేదలకు ఆరోగ్య సంరక్షణ సేవలు చేరువకానున్నాయి. మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులకు అవకాశాలు పెరిగాయి. ప్రభుత్వ నిర్ణయంతో రెండు జిల్లాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్కు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గద్వాలలో బీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి పటాకులు కాల్చారు. మల్దకల్, గట్టు, ధరూర్ మండలాల్లోనూ సంబురాలు జరుపుకొన్నారు.
గద్వాల, జూలై 5: సమైక్య రాష్ట్రంలో వైద్యం కోసం పడిన గోస అంతా ఇంత కాదు. తెలంగాణ సాధించుకున్నాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో సర్కారు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ అందరికీ అధునాతన వైద్యాన్ని చేరువ చేస్తున్నారు. ఈక్రమంలో ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయగా.. తరువాత వనపర్తి, నాగర్కర్నూల్కు ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు ప్రభుత్వం మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రజలకు మెరుగైన వైద్యం మరింత చేరువ కానున్నది.
జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో 80 విడుదల చేసింది. అందులో 100 సీట్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు జిల్లా ప్రజలకు వైద్యం దైవాదీనం. ఏదైనా ప్రమాదం జరిగినా, ఇతర అత్యవసర చికిత్సల కోసం కర్నూల్ లేదా హైదరబాద్కు తరలించేవారు. ప్రభుత్వం జిల్లాల పునర్విభన చేయడంతో జిల్లాకేంద్రంలోని దవాఖానలో వసతులు కల్పించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. విద్యాపరంగా వెనుకబడిన జోగుళాంబ గద్వాల జిల్లాకు ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేయడంతో ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వైద్యహబ్గా జోగుళాంబ గద్వాల జిల్లా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జిల్లాలో రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రభుత్వ దవాఖాన స్థాయిని 100 నుంచి 300 పడకలకు పెంచారు. దీంతోపాటు రోగనిర్ధారణ పరీక్షలు చేయడానికి తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసి ఉచితంగా 57 రకాల పరీక్షలు చేస్తున్నారు.
దీనికితోడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం రోగులకు అందుతున్న 57 పరీక్షలను కలుపుకొని మొత్తం 134 పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో పాథాలజీ, రేడియాలజీ ల్యాబ్స్ కూడా ఉన్నాయి.
ప్రైవేట్ దవాఖానల్లో ఎన్నిరకాల టెస్ట్లు చేస్తారో అన్ని పరీక్షలను తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లో ఉచితంగా చేసి 24 గంటల్లో ఫలితాలను అందిస్తున్నారు. గతేడాది జిల్లాకు ప్రభుత్వం నర్సింగ్ కళాశాలను మంజూరు చేయగా.. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో కళాశాల విజయవంతంగా నడుస్తున్నది. రోగులకు చికిత్స అందిన వెంటనే అవసరమైన మందులు అందించడానికి గానూ ప్రభుత్వం జిల్లాకు సెంట్రల్ డ్రగ్ స్టోర్ను కూడా మంజూరు చేసింది. ప్రస్తుత కాలంలో యువకులు ఎక్కువగా గుండెపోటుతో మరణిస్తున్నారు. దీంతో గుండెపోటును అడ్డుకునేందుకు జిల్లా దవాఖానలో టినెక్ట్ ప్లాస్ టీకాను అందుబాటులో ఉంచింది.
వెనుకబడిన జిల్లాలోని ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఆలోచనతో ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జోగుళాంబ గద్వాల జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం హామీ నిలబెట్టుకోగా.. గద్వాల జిల్లా వైద్యపరంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం లభించింది. ప్రస్తుతం ఉన్న దవాఖానను సూపర్స్పెషాలిటీ జనరల్ దవాఖానగా మార్చే అవకాశం ఉంది. జిల్లా దవాఖానలో వైద్యుల కొరత తీరే అవకాశం కూడా కలిగింది. అధునాతన ల్యాబ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జిల్లాకు మెడికల్ కళాశాల కోసం కృషి చేసిన ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
గద్వాలలో ‘కళాశాల సంబురం’
గద్వాల అర్బన్, జూలై 5 : ప్రభుత్వం గద్వాల జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ జీవో విడుదల చేసిన సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయం నుంచి పాత బస్డాండ్ వరకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. పాత బస్డాండ్లో పటాకులు కాల్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోని చిట్టచివరి జిల్లా అయిన గద్వాలకు బీసీ, ఎస్టీ, మైనార్టీ, గురుకుల పాఠశాలలు, నర్సింగ్, పీజీ, ఎంబీఏ, మెడికల్ కాలేజీలు కేటాయించడం సంతోషకరమైన విషయమన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, సింగిల్విండో అధ్యక్షులు తిమ్మారెడ్డి, వెంకటేశ్, నాయకులు సాయి, శ్యాంరెడ్డి, పురుషోత్తంరెడ్డి, నాగిరెడ్డి, చెన్నయ్య తదితరులు ఉన్నారు.
నా కోరిక నెరవేరింది..
వెనుకబడిన గద్వాల జిల్లాకు మెడికల్ కళాశాల తీసుకొచ్చి పేదలకు అధునాతన వైద్యం అందించాలనే నా కోరిక నెరవేరింది. జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి మెడికల్ కళాశాల మంజూరు చేయడం సంతోషంగా ఉన్నది. గద్వాలకు మెడికల్ కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు. జిల్లాకు ఇదివరకే నర్సింగ్ కళాశాలను మంజూరు చేసి పేద విద్యార్థులు నర్సింగ్ కోర్సు చేయడానికి అవకాశం కల్పించారు. మెడికల్ కళాశాల మంజూరుతో ఈ ప్రాంతం వైద్యపరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడింది.
– బండ్ల కృష్ణమోహన్రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే
మల్దకల్లో సంబురాలు..
మల్దకల్, జూలై 5 : జోగుళాంబ గద్వాల జిల్లాకు ప్రభుత్వం మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతో మల్దకల్లో బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైస్ఎంపీపీ పెద్ద వీరన్న, సర్పంచ్ యాకోబు ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి స్వీట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రతాప్, ఆలయకమిటీ చైర్మన్ ప్రహ్లాదరావు, మార్కెట్యార్డు చైర్మన్ సవారన్న, బీఆర్ఎస్ నాయకులు నరేందర్, మధు, పరశురాముడు, తిమ్మరాజు, ప్రభాకర్, శేఖర్, గోవిందు, మహేశ్, బద్రి, కిష్టన్న, నారాయణ, నాగరాజు, ఆంజనేయులు, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
స్వీట్లు పంచిన మాజీ సర్పంచ్
ధరూర్, జూలై 5 : ప్రభుత్వం జోగుళాంబ గద్వాల జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయడంతో ధరూర్లో మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బండ్ల విజయ్కుమార్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అలీ, నిజాంసాబ్, జబ్బర్మియా, రంగన్న, గోవిందు, సవారన్న, దౌలత్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.