అచ్చంపేటటౌన్, ఆగస్టు 17 : వడ్డెరల అభివృద్ధికి కేసీఆర్ సర్కారు కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు తెలిపారు. పట్టణంలోని షామ్స్ ఫంక్షన్హాల్లో గురువారం వడ్డెర సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ గువ్వల మాట్లాడుతూ వడ్డెరుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారన్నారు. కులవృత్తుల వారికి రుణాలను మంజూరు చేస్తున్నారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తూ అభివృద్ధి వైపు పయనిస్తున్న వేళ ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. మానిఫెస్టోలో లేని వాటిని కూడా అమలుచేస్తున్నామన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వడ్డెర సంఘం సభ్యులు విప్ గువ్వలకు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అరుణ, వడ్డెర సంఘం అధ్యక్షుడు సుధాకర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.