ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం తీపికబురును అందించింది. సీఎం కేసీఆర్ వారిని అక్కున చేర్చుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ విలీనానికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. 3 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టడంతో పట్టరాని ఆనందం నెలకొన్నది. ఉమ్మడి పాలమూరు రీజియన్లో మొత్తం 10 బస్ డిపోలు ఉంటే.. 3,440 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరూ సంబురాల్లో మునిగిపోయారు. తమను తలెత్తుకునేలా చేశారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వనపర్తి టౌన్, జూలై 31 : ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయని మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, మార్కెట్కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట సోమవారం ఆర్టీసీ కార్మికులు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉద్యమకాలంలో వెన్నుదన్నుగా నిలిచిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ఆనందంగా ఉన్నదన్నారు. అంతకుముందు డిపో ఎదుట పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ప్రమోద్రెడ్డి, పట్టణ ఇన్చార్జి ప్రకాశ్, బీఆర్ఎస్ నాయకులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
కార్మిక స్థాయి నుంచి.. ప్రభుత్వ ఉద్యోగులుగా
మహబూబ్నగర్ టౌన్, జూలై 31 : చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే కనీవిని ఎరుగని రీతిలో ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు మంచి చేస్తూ వస్తున్నది. ఇప్పటికే 44శాతం ఫిట్మెంట్ ఇవ్వగా, నేడు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్ రీజియన్ వ్యాప్తంగా 3,440మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు.
కందనూలు జిల్లాలో 1,340 మంది
కందనూలు, జూలై 31 : తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఆమోదం తెలపడంతో జిల్లాలోని ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4 డిపోల్లో మొత్తం 1,340మంది ఉద్యోగులు ఉన్నారు. నాగర్కర్నూల్లో 338, అచ్చంపేటలో 338, కొల్లాపూర్లో 248, కల్వకుర్తి 416 మంది సిబ్బంది ఉన్నారు. కేసీఆర్ నిర్ణయంతో వారి ముఖాల్లో ఆనందం విరబూస్తోంది.
అస్సలు ఊహించలేదు..
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రెండు పీఆర్సీలు వస్తాయి అనుకున్నాం. యూనియన్లను తీస్తే భయపడిపోయాం. గింత మంచి పనిచేస్తారు అనుకోలేదు. సీఎం కేసీఆర్ తీపి కబురు చెబుతారని అనుకున్నాం. కానీ అంతకు మించిన సమాచారం వింటాం అనుకోలేదు. కొంత ఆలస్యమైనా అయిన మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీకి అండగా ఉంటున్న ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
– కోడూర్ శ్రీనివాస్గౌడ్,డ్రైవర్ , మహబూబ్నగర్
సీఎం కేసీఆర్ను జీవితాంతం మర్చిపోం
ఆర్టీసి కార్మికులు, ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి జీవితాంతం రుణపడి ఉంటాం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీ కార్మికులను సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో విలీనం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పడం హర్షణీయం. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అచ్చంపేట డిపో పరిధిలో దాదాపు 370మంది కార్మికులు, ఉద్యోగులం ఉన్నాం.
– మున్నా, కండక్టర్, అచ్చంపేట
కేసీఆర్ మానవతావాది
ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతావాది. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఆయన కండ్లారా చూశారు. సకలజనుల సమ్మెలో పాల్గొన్నందుకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి మాకు జీతం ఇవ్వకపోతే తెలంగాణ వచ్చాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 27 రోజల జీతం ఇచ్చారు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం మమ్మల్ని గర్వంగా నిలబెట్టడమే.
– శ్యాంసుందర్రెడ్డి, మెకానిక్, నాగర్కర్నూల్
కేసీఆర్కు రుణపడి ఉంటాం..
ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ ఆర్టీసీ కార్మికులమంతా రుణపడి ఉంటాం. ఇన్నాళ్లు కార్పొరేషన్గా ఉన్న ఆర్టీసీని ప్రభుత్వపరం చేయడం హర్షంచదగిన విషయం. ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో మాతోపాటు మా కుటుంబసభ్యులు సంతోషపడుతున్నరు. మా జీతాలు కూడా పెరుగుతయి. మాకు, మా కుటంబాలకు కేసీఆర్ కొండంత భరోసా కల్పించారు. ఎప్పుడు ఉద్యోగం నుంచి తొలగిస్తారో తెలియక అయోమయంగా ఉన్న మాకు ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగ భద్రత కలిగింది.
– సుదర్శన్, కండక్టర్, నారాయణపేట డిపో
తలెత్తుకునేలా చేశారు
ముఖ్యమంత్రి దార్శనీకుడు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఏర్పడ్డాక ప్రగతిభవన్లో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి ఆదుకుంటామని, సంస్థను కాపాడుకుందామని తెలిపారు. దానికి అనుగుణంగానే సోమవారం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారంటే ఆయన మమ్మల్ని తలెత్తుకునేలా చేసినట్లే. మేము కేసీఆర్కు రుణపడి ఉంటాం. మరింత ఉత్సాహంగా పనిచేస్తాం.
– నర్సింహ్మ, డ్రైవర్