కల్లుగీత వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పింఛన్, కల్లు అద్దెలు, బకాయిల మాఫీ, మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గౌరవించారు.తాజాగా గౌడన్నలకు ధీమా కల్పించడానికి రైతుబీమా తరహాలో గీత కార్మికులకు బీమా కల్పించాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కల్లుగీస్తూప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే బీమా వర్తించనున్నది. వారంలోనే బాధిత కుటుంబాల నామినీ ఖాతాలో రూ.5 లక్షలు జమ కానున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని వేలాది మంది గౌడ కులస్తులకు ఆర్థిక భరోసా లభించనున్నది. గౌడ కులస్తులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
వనపర్తి, మే 21 : చెట్టు కల్లు తాగడం వల్ల ఎన్నో రోగాలు దూరమతాయని.. చాలామంది దానికోసం ఎంతదూరమైనా వెళ్తుంటారు. ఔషధం లాంటి కల్లును మనకు అందిస్తున్న గీత కార్మికుల జీవితాల్లోకి తొంగి చూస్తేనే వాళ్ల పరిస్థితి కనిపించదు. కల్లు గీసే క్రమంలో వారు చెట్టుమీదకి ఎక్కడం, దిగడం చేసినప్పుడు అనుకోకుండా ఏదైనా జరిగితే ఆ కుటుంబ పరిస్థితి వర్ణణాతీతం. గతంలో చెట్లు పైనుంచి పడిపోతే వారికి కొద్దిపాటి నగదును అందించేవారు. ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గీత కార్మిలకు బీమా కల్పించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. చెట్టు పైనుంచి కింద పడినా, ఇతర ఏ కారణం చేతనైనా కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి బీమా అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. గతంలో బీమా పొందేందుకు కార్మికులు ఇబ్బందులు పడేవారు. ఈక్రమంలోనే వారికి వారంలోగా బీమా నగదు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
బీమా రూ.5లక్షలకు పెంపు
గీత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించేందుకుగానూ ప్రభుత్వం బీమా పరిహారాన్ని రూ.5లక్షలకు పెంచింది. గతంలో ప్రమాదశాత్తు కార్మికుడు చెట్టు పైనుంచి కిందపడి మృతి చెందినా, శాశ్వత వైకల్యం పొందినా.. తాత్కాలికంగా రూ.10వేలు అందించి బీమా కింద రూ.2లక్షల పరిహారం చెల్లించేవారు. కాగా ప్రభుత్వం ఈ బీమా మొత్తాన్ని రూ.5లక్షలకు పెంచి మరింత భరోసాను కల్పిస్తున్నది.
జిల్లావ్యాప్తంగా వివరాలిలా..
వనపర్తి జిల్లావ్యాప్తంగా ఎక్సైజ్శాఖ పరిధిలో మూడు స్టేషన్లున్నాయి. 118 గ్రామాల పరిధిలో 329మంది లబ్ధిదారులు, 53 సొసైటీల పరిధిలో 959మంది మొత్తం 1,288మందికి బీమా సౌకర్యం అందనున్నట్లు అధికారులు తెలిపారు.
గీత కార్మికులకు అండగా..
30 ఏండ్లుగా నేను కల్లు గీస్తున్నాను. చెట్ల పైకి ఎక్కి కల్లు గీస్తే గాని నోట్లోకి ముద్ద వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. గతంలో ఏడాదికోసారి లైసెన్స్ రెన్యువల్ కోసం ఎక్సైజ్ శాఖ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలాంటి సమస్యలు లేవు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక మా బతుకుల్లో వెలుగులు నిండినయ్.
– రామన్గౌడ్, గీత కార్మికుడు, బుసిరెడ్డిపల్లి గ్రామం, పాన్గల్ మండలం
లబ్ధిదారుల ప్రక్రియ పూర్తి
గీత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వనపర్తి జిల్లా పరిధిలో మొత్తం 1,288మంది లబ్ధిదారుల వివరాలను సేకరించాం. గీత కార్మికులకు బీమా సౌకర్యం ఎంతగానో ఉపయోగపడనున్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం.
– ప్రభు వినయ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, వనపర్తి జిల్లా
బీమాతో భరోసా
గీత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవడంతోపాటు రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు బీమా నగదును పెంచడం ఆనందంగా ఉంది. ఇప్పటికే గౌడన్నలకు వైన్స్ షాపుల్లో రాయితీ కల్పించారు. బీమాను పెంచి గౌడ కుటుంబాలకు ప్రభుత్వం భరోసానిచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగింకునేందుకు ఎక్సైజ్శాఖ కార్యాలయంలో తమ ఆధార్కార్డుతో పూర్తిస్థాయి లైసెన్స్, సొసైటీ సభ్యుల వివరాలను అందజేయాలి.
– శ్రీనివాస్గౌడ్, గీత కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు, వనపర్తి