గద్వాల టౌన్, ఆగస్టు 8 : కార్పొరేట్ కళాశాలతో ప్రభుత్వ కాలేజీలు పోటీపడుతూ ముందుకు పోతున్నాయి. ఆ పోటికి తగ్గట్టుగానే ప్రభుత్వం ఉన్నత విద్యలో ప్రతి ఏటా కొత్త కోర్సులు ప్రవేశపెడుతూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నది. ఈక్రమంలో విద్యాసంవ్సతరం మరో నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. చదువుతోపాటు విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొదించుకుని కొలువు సాధించేలా కొత్త కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ కోర్సులు అప్రెంటిషిప్ విధానంలో కొనసాగుతాయి. దీంతో విద్యార్థులు కొత్త కోర్సులపై ఆసక్తి కనబర్చుతున్నారు. ఈమేరకు ఎంఏఎల్డీ డిగ్రీ కళాశాలలో సీట్లన్నీ భర్తీ అయ్యాయి.
2023-24 విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో కొత్త కోర్సులను ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 64 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అంప్రెటిషిప్ విధానంలో ఉన్న కోర్సులను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా జిల్లాలోని ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనూ నూతన కోర్సులు ప్రారంభించేందుకు అనుమతి లభించింది.
కోర్సులు ఇవే..
ఎంఏఎల్డీ కళాశాలలో ఇప్పటికే 23 కోర్సులు ఉన్నాయి. తాజాగా ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు అదనంగా మరో నాలుగు కోర్సులను ప్రవేశపెట్టారు. బీఏలో సీబీసీఎస్లో టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సు, రిటైల్ ఆపరేషన్ కోర్సు, అలాగే బీఎస్సీలో హెల్త్కేర్ మేనేజ్మెంట్ కోర్సు, బీఎస్సీ ఐప్లెడ్ న్యూట్రిషన్ కోర్సు, బీఎస్సీ మైక్రోబయోలజీ కోర్సులను ప్రారంభించనున్నారు. అందుకుగానూ ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. వందమందికి పైగా విద్యార్థులు ఆయా కోర్సుల్లో అడ్మిషన్లు పొందారు.
కోర్సుల ప్రత్యేకత..
నేటి యువత సరైన సమయంలో చదువు పూర్తి చేసినా కొలువులు మాత్రం దక్కడం లేదు. దీంతో చదువుతోపాటు నైపుణ్యాన్ని సాధించి సులువుగా ఉద్యోగం సాధించేలా డిగ్రీలో నూతన కోర్సులను విద్యాశాఖ ప్రవేశపెట్టింది. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులు చదువుతోపాటు అంప్రెటిషిప్ చేస్తారు. విద్యాసంస్థతో అనుసంధానమైన పరిశ్రమలు, స్టోర్స్, ఇతర కార్యాలయాల్లో పనిచేస్తారు. ఇందుకు ైస్టెఫండ్ కూడా వస్తుంది.
విస్తృత ప్రచారం..
నూతన కోర్సులపై అధ్యాపకులు గ్రామగ్రామాన తిరుగుతూ విద్యార్థులకు కోర్సు ప్రాముఖ్యతను వివరించారు. కోర్సులు పూర్తి చేయడం వల్ల కలిగే ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. దీంతో విద్యార్థులు నూతన కోర్సులపై ఆసక్తి కనబరుస్తున్నారు.
అమలుపై నెలకొన్న సందిగ్ధత
నూతన కోర్సులు ప్రారంభించడం శుభపరిణామమే అయినా విధివిధానాలపై సరైన స్పష్టత లేకపోవడంతో సందిగ్ధత నెలకొంది. కోర్సుల సిలబస్ ఇంతవరకు కళాశాలకు అందలేదు. అలాగే కోర్సులు బోధించేందుకు అధ్యాపకుల నియామకం చేపట్టలేదు. దీంతో కోర్సుల కొనసాగింపు ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకే ఆధారపడి ఉందన్న అభిప్రాయం అధ్యాపకుల నుంచి వ్యక్తమవుతుంది.
ఆసక్తి కనబర్చుతున్న విద్యార్థులు..
నూతన కోర్సులు ప్రవేశపెట్టడాన్ని స్వాగతించాల్సిన విషయం. కళాశాల స్థాయిలోనే చదువుతోపాటు కొలువుపై నమ్మకం వస్తుంది. విద్యార్థులు నూతన కోర్సులపై ఆసక్తి కనబర్చుతున్నారు. ఈనెల 12వ తేది వరకు స్పెషల్ ఫేజ్ నిర్వహిస్తున్నాం. దీంతో మరిన్ని అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. దోస్త్ ముగిసే నాటికి సిలబస్పై స్పష్టత వస్తుంది.
– శ్రీపతినాయుడు, కళాశాల ప్రిన్సిపాల్