మక్తల్ రూరల్, డిసెంబర్ 6 : నియోజకవర్గం లో స్కాంలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఊట్కూర్ ఎస్బీఐలో నకిలీ పట్టా పాస్పుస్తకాలు సృష్టించి రూ.కోట్ల రుణాలు స్వాహా చేసిన ఘటనపై విచారణ కొనసాగుతున్నది. ఈ క్రమంలో మక్తల్ ఎస్బీఐ సీఎస్పీలో మరో స్కాం బయట పడింది.
మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకు న్న రుణాలు, పొదుపు డబ్బులు, రికవరీ సొమ్మును బ్యాంక్లో జమ చేయకుండా ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ సెంటర్ ఏజెంట్ స్వాహా చేసిన ఉదంతం వె లుగులోకి వచ్చింది. మక్తల్, మాగనూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో మహిళా సంఘాలు ప్రతి నె లా చెల్లించిన డబ్బును బ్యాంక్లో జమ చేయకుండా రూ.30 లక్షల వరకు దుర్వినియోగం చేసినట్లు సమాచారం. డబ్బుల అవకతవకలపై మక్తల్ మండల మహిళా సమాఖ్య అధికారి ఫిర్యాదుతో ఈ బాగోతం బయటపడింది. బ్యాంక్ వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు మక్తల్ పట్టణంలోని ఎస్బీఐ పక్కన కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్పీ) ఏర్పాటు చేశారు. జానకి అనే మహిళ ఈ పాయింట్ను నడుపుతున్నది. కాగా, కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుంచి మహిళా సంఘాల రుణాల రికవరీ డబ్బులను సీఎస్పీలో తీసుకోవాలని బ్యాంక్ అధికారు లు జానకికి అనుమతిచ్చారు. అప్పటి నుంచి మక్త ల్, మాగనూర్ మండలాల్లోని గ్రామాల మహిళా సమాఖ్య సభ్యులు మక్తల్ సీఎస్పీలో రుణాలకు సంబంధించిన కంతులు, పొదుపు డబ్బులు చెల్లిస్తున్నారు. మక్తల్ మండల మహిళా సమాఖ్యలో 840 సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాలకు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా 2019-20లో రూ.14 కోట్లు విడుదల చేశారు. రుణాలు తీసుకున్న సభ్యులు కంతులను సీఎస్పీల్లో క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. సీఎస్పీ నిర్వహిస్తున్న మహిళ సంబంధిత బ్యాంక్ కరస్పాండెంట్ ఖాతాలో డబ్బులు జమ చేయకుండా దుర్వినియోగానికి పాల్పడినట్లు సమాచారం. అయితే, పూర్తి స్థాయి విచారణ జరిపితే ఏయో సంఘం డబ్బులు ఎన్ని స్వాహా చేశారనే విషయం తెలియనున్నది.
బయట పడిందిలా..
మహిళా సంఘాలు రుణాలు సక్రమంగా చెల్లించడంలేదని రెండు రోజుల కిందట మక్తల్ మండలం భూత్పూర్ గ్రామంలో సుధాకర్ అనే మహిళా సంఘం సభ్యులను అధికారులు విచారణ చేయడంతో ఈ ఉదంతం బయటపడింది. తమ సంఘం నుంచి ఎలాంటి అప్పులు బకాయి లేదని వారు చెప్పడంతో అధికారి అవాక్కయ్యారు. దీంతో మక్తల్ ఎస్బీఐ మేనేజర్ సదరు సంఘం ఖాతాలను పరిశీలించగా.. రుణాలు చెల్లించడం లేదని తేలింది. ఈ విషయంపై సీఎస్పీ సెంటర్ నిర్వాహకురాలు జానకిని ప్రశ్నించగా.. కొందరి ఖాతాలు తేడా ఉండడంతో డబ్బులు బ్యాంక్లో జమ కాలేదని తెలిపింది. ఈ వ్యవహారం ఏడాది నుంచి కొనసాగుతున్నా.. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యం వల్ల పేదల డబ్బులను దుర్వినియోగమైనట్లు పలువురు చర్చింకుంటున్నారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు..
డబ్బుల దర్వినియోగంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఏపీఎం నారాయణ తెలిపారు. రికవరీ డబ్బులను జానకి బ్యాంక్లో జమచేయకుండా సొంత ఖర్చులకు వాడుకొని అక్రమాలకు పాల్పడిందని ఎస్బీఐ రీజినల్ మేనేజర్ మహబూబ్నగర్, నారాయణపేట కలెక్టర్లకు, లీడ్ జిల్లా బ్యాంక్ మేనేజర్కు, డైరెక్టర్ బ్యాంక్ లింకేజీ హైదరాబాద్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
అవకతవకలపై ఏజీఎం విచారణ..
రుణాల రికవరీకి సంబంధించిన అక్రమాలపై ఈ నెల 4వ తేదీన ఎస్బీఐ ఏజీఎం అధికారులు విచారణ చేశారు. ఏపీఎం నారాయణ, బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్రావు, సీఎస్పీ కరస్పాండెంట్ జానకి సమక్షంలో ఖాతాలు పరిశీలించారు. తప్పుడు రశీదులు ఇచ్చి మహిళా పొదుపు సంఘాలు చెల్లించిన డబ్బులను జానకి బ్యాంక్లో జమ చేయలేదని తేలింది. మక్తల్ మండలం భూత్పూర్, పంచదేవపహాడ్, ముస్లాయపల్లి, మాగనూర్ మండలం వడ్వాట్, అడవి సత్యారం, నర్వ మండలం కల్వాల్ తదితర గ్రామాలకు సంబంధించిన దాదాపు 100కు పైగా పొదుపు సంఘాల ఖాతాలను పరిశీలించారు. చెల్లించిన రశీదులకు.. బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన డబ్బులకు తేడా ఉన్నట్లు గుర్తించారు. దాదాపు రూ.6.50 లక్షలు బ్యాంక్కు చెల్లించకుండా స్వాహా చేసినట్లు తెలిసింది. ఈ మేరకు సీఎస్పీని బ్యాంక్ అధికారులు సీజ్ చేసినట్లు నోటీస్ అతికించారు.