వనపర్తి, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): సమైక్య రాష్ట్రంలో నిర్వీర్యమైన కులవృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఊపిరి పోస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం శ్రీరంగాపూర్ మండలంలోని రంగసముద్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రొయ్య పిల్లలను వదిలారు. సమైక్య రాష్ట్రంలో చెరువులు ఎండిపోయి మత్స్యకారులు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చెరువులకు జీవం పోశాయన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు నింపారన్నారు. గ్రామీణ ప్రజలకు చేపల రూపంలో పౌష్టికాహారం అందుబాటులోకి వచ్చిందన్నారు.
సబ్సిడీ గొర్రె పిల్లలతో గొల్ల కురుమలకు ఆర్థిక స్థిరత్వం లభించిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచితంగా 24 గంటల కరెంటు, సాగునీటి సౌకర్యంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శమయ్యాయన్నారు. తెలంగాణ పథకాలకు పేర్లను మార్చి కేంద్రం అమలు చేస్తున్నదన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మత్స్య శాఖ అభివృద్ధి జిల్లా అధికారి రహెమాన్, ఎంపీపీ గాయత్రి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటస్వామి, సర్పంచ్ వినీలారాణి, రైతుబంధు మండలాధ్యక్షుడు గౌడనాయక్ పాల్గొన్నారు.
రైతు శ్రేయస్సే ప్రధాన లక్ష్యం
పెబ్బేరు, నవంబర్ 17: రైతు శ్రేయస్సే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం పెబ్బేరు మున్సిపాలిటీ సమీపంలోని జాతీయ రహదారి రంగాపూర్ బైపాస్ వద్ద 2వేల టన్నుల సామర్థ్యం గల నూతన గోదాం నిర్మాణానికి ప్రాథమిక సహకార పరపతి సంఘం అధ్యక్షుడు గౌని కోదండరామ్రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కరుణశ్రీ, ఎంపీపీ శైలజ, జెడ్పీటీసీ పద్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఎండీ ముస్తాక్, ఐజాక్, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు రాములుయాదవ్, దిలీప్ కుమార్రెడ్డి, మల్లేశ్యాదవ్, భారతి, జ్యోతి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, సింగిల్విండో సిబ్బంది పాల్గొన్నారు.