యువతి మనసు గెలిచిన యువ ఐఏఎస్
వినూత్న రీతిలో డిజిటల్ పెండ్లి ఆహ్వాన పత్రిక
మహబూబ్నగర్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అప్పటికే సివిల్స్ మెయిన్స్ రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ఓ యువకుడు యాదృచ్ఛికంగా ఓ యువతిని చూసి ఇష్టపడ్డాడు. ఎలాగైనా ఆమెనే తన అర్ధాంగిని చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఆ యువతితో పరిచయం పెంచుకోవాలని తపించిపోయాడు. అందుకోసం నిత్యం ఆమెను ఫాలో అయ్యాడు. ఓ రోజు ఎలాగోలా తన మనసులోని మాటను ఆమెకు చెప్పాడు. తర్వాత కొన్నాళ్లకు ఆమె ఆ యువకుడి మనసును అర్థం చేసుకున్నది. తర్వాత ఇరువురి కుటుంబ సభ్యులతో మాట్లాడి పెండ్లి ఖాయం చేసుకున్నారు. ఈ కథలో యువకుడి పేరు రాహుల్. ప్రస్తుతం ఆయన ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్. ఆ యువకుడి సొంతూరు నారాయణపేట జిల్లా కేంద్రం. ఆయన ప్రేమించిన యువతి మహబూబ్నగర్ పట్టణానికి చెందిన మనీషా. ఆమె ఎస్జీటీ టీచర్గా పనిచేస్తోంది. వారి కులాలు, మతాలు తెలియకుండానే ప్రేమించుకున్నారు. కులాంతర వివాహమైనా కూడా ఇరువైపులా తల్లితండ్రులు పెద్ద మనసుతో వారి మనసులో మాటను అంగీకరించారు. ఇవాళ మహబూబ్ నగర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో వీరి పెండ్లి జరగనున్నది. అయితే ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా… పెళ్లికొడుకు తన వివాహ ఆహ్వాన పత్రికను డిజిటల్ విధానంలో సరికొత్తగా తయారు చేసి ఆహ్వానించడమే విశేషంగా మారింది. తను యువతి మనసును గెలుచుకునేందుకు ఏ విధంగా ప్రయత్నించింది, యువతిపై తనకున్న ప్రేమను ఎలా వ్యక్తం చేసింది కవితల రూపంలో వర్ణిస్తూ… తమ రూపాలను డిజిటల్లో చిత్రీకరిస్తూ వీడియో తయారు చేశాడు. ఆ వీడియో బంధు మిత్రులకు పంపించి తమ పెండ్లికి ఆహ్వానించాడు. అదే ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నది. యువ ఐఏఎస్ అధికారి తన ప్రేమను వ్యక్తం చేసిన తీరు, పెండ్లికి ఆహ్వానించిన విధానం ప్రస్తుతం మహబూబ్నగర్, నారాయణపేట, ఖమ్మంలో వైరల్గా మారింది. ప్రేమ కోసం ఓ ఐఏఎస్ అధికారి పడిన తపన, అందులో ఆయన విజయం సాధించ డం అందరినీ ఆకట్టుకుంటోంది. జీవితంలో ప్రేమ పేరిట కొందరు యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటుంటే.. ఎంతో కష్టపడి తన ప్రేమను గెలిపించుకోవడ మే కాకుండా కష్టపడి ఐఏఎస్ సాధించిన రాహుల్ నేటి తరం యువతకు ఆదర్శంగా మారాడని పలువురు పేర్కొంటున్నారు.