గద్వాల జోగులాంబ : రైతులు ఆయిల్ పామ్ సాగు చేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయిల్ పామ్ సాగుపై ఉద్యానవనశాఖ, వ్యవసాయ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో ఆయిల్ పామ్ విస్తీర్ణ పథకం కింద 4690 ఎకరాలు లక్ష్యంగా ఉండగా, 2367 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగైందని. మిగిలిన 2323 ఎకరాలలో ఆయిల్ పామ్ పంటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు వచ్చేలా వ్యవసాయ అధికారులు కృషి చేయాలనీ కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారికి 5 ఎకరాల వరకు లక్ష్యం ఉండగా.. జనవరి, ఫిబ్రవరి రెండు నెలల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించి, సాగుకు ముందుకు వచ్చేలా చూడాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు డ్రిప్ కోసం ఎకరాకు 4200 సబ్సిడీ జమ అవుతుందని తెలిపారు. డ్రిప్ ప్లాంటేషన్ కోసం డీడీలు కట్టించాలని.. అధికారులు సమన్వయంతో మిగిలిపోయిన లక్ష్యాలను పూర్తి చేయలనీ అదేశించారు. ఈ సమావేశంలో ఉద్యాన శాఖ అధికారి అక్బర్, వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.