గద్వాల, ఏప్రిల్ 6 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధుతో దళితులు లబ్ధిపొంది మరింత మందికి ఉపాధి కల్పించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో దళితబంధు పథకానికి ఎంపికైనా లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఇన్చార్జి కలెక్టర్ యాస్మిన్ బాషాతో కలిసి ఎమ్మెల్యే హా జరయ్యారు. 47 మంది లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితులు ఎప్పుడూ తీసుకునే వారు కాకుండా పది మందికి ఇచ్చే వారిగా ఎదగాలని కాంక్షించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధును వినియోగించుకుని గౌరవంగా బతకాలని సూచించారు. మాది మాటల ప్రభుత్వం కాదని.. చేతల్లో చూపే సర్కార్ అన్నారు. ఈ పథకంతో భవిష్యత్ను బంగారుమయం చేసుకోవాలన్నారు. అందరూ ట్రాన్స్పోర్టు యూనిట్లు తీసుకోకుండా ఇతర యూనిట్లకు ఆసక్తి చూపాలని సూచించారు.
అనంతరం అంబేద్కర్, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం జెడ్పీచైర్పర్సన్ సరిత మాట్లాడుతూ దళితబంధు నుంచి దళితులు అభివృద్ధి చెంది తెలంగాణ రాష్ర్టాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలపాలని కోరారు. దళిత బిడ్డలను ముందుకు తీసుకెళ్లడానికి సీఎం కేసీఆర్ ఈ పథకం అమలు చేశారన్నారు. దళిత కుటుంబాలన్నింటినీ అభివృద్ధి చేయడానికే ముఖ్యమంత్రి ఈ పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. కలెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ దళితబంధు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. లబ్ధిదారుడి పేరు మీద ఖాతాలు తెరుస్తామని, వారి ఖాతా నుంచి ఎంత డబ్బు వినియోగించారో.. తెలుసుకోవడానికి స్మార్ట్ కార్డు అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలతో లబ్ధిదారుడు ఎన్ని యూనిైట్లెనా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని కాంక్షించారు.
మాకు రాలేదని ఎవరూ దిగులు చెందొద్దని.. రాబోయే కాలంలో పేద దళితులందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. దళితుల సంక్షేమానికి ప్రభుత్వం దళిత రక్షణనిధి ఏర్పాటు చేసిందని, లబ్ధిదారుడికి ఇచ్చే రూ.10 లక్షల్లో రూ.10 వేలు ఇందులో జమ చేస్తామని, దీనికి ప్రభుత్వం మరో రూ.10 వేలు జమ చేస్తుందన్నారు. వీరిలో ఎవరికైనా ఆపద సంభవిస్తే ఆ సమయంలో ఈ మొత్తం ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, ఎంపీపీలు ప్రతాప్గౌడ్, మనోరమ, నజమున్నీసా బేగం, అదనపు కలెక్టర్ శ్రీహర్ష, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్బాబు, అధికారులు, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.