జోగులాంబ గద్వాల : జిల్లాలో కోవిడ్ టీకా వేసుకొని వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి తిరిగి ఓటర్ లిస్టు ప్రకారం చెక్ చేసి వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేయించాలన్నారు.
సోమవారం కల్లెక్టరేట్లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన కన్వర్జెన్సీ సమావేశంలో మాట్లాడుతూ.. వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న వారి లిస్టు తీసుకొని 84 రోజులు దాటిన తరవాత వారికి తప్పనిసరిగా రెండో డోస్ వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. టీకా వేసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుందని, ప్రతి ఒక్కరికి టీకా పై అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా లో పెండింగ్ ఉన్న వారందరికీ వాక్సిన్ వేసి, 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేసేలా చూడాలన్నారు. జిల్లాలో రెండు అగ్ని ప్రమాదాలు జరిగినందున ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్ని ప్రమాదం జరగకుండా పకడ్బందిగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
గ్రామ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ (విసిపిసి) సమావేశాలలో స్పెషల్ అధికారులు పాల్గొనాలని సూచించారు.
పాఠశాలలో పిల్లలు 100 శాతం హాజరు అయ్యేలా చూడాలని, డ్రాప్ అవుట్ అయిన పిల్లలను పాఠశాలకు కు పంపించే విధంగా వారి తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. పదో తరగతి చదివే విద్యార్థులకు స్పెషల్ క్లాసులు, పరిక్షలు నిర్వహిస్తునారా చెక్ చేసి స్పెషల్ రిపోర్ట్ తయారు చేసి పంపించాలని జిల్లా విద్యా శాఖ అధికారిని ఆదేశించారు. అనంతరం ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రఘురామ్ శర్మ, శ్రీ హర్ష పాల్గొన్నారు.