సమాచారం లేకుండా సమీక్ష అంటూ మండిపాటు
తమను పట్టించుకోని పార్టీలో ఎందుకు ఉండాలంటూ ఆవేదన
పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి సాక్షిగా ఘటన
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 7 : జడ్చర్లలో కాంగ్రెస్ నాయకుల మధ్య కుమ్ములాటలు చోటుచేసుకున్నాయి. సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఆ పార్టీలోని ఇరువర్గాల మధ్య గొడవలు, ఒకరిపైనొకరి దూషణలు, తోపులాటలు జరిగాయి. ఈ ఘటనలో ఓ కార్యకర్త ముక్కుకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, జిల్లా ఇన్చార్జి వేం నరేందర్రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ సమక్షంలోనే కార్యకర్తలు తన్నుకున్నారు. సోమవారం సాయంత్రం జడ్చర్లలోని ప్రేంరంగా గార్డెన్ ఫంక్షన్హాల్లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో జడ్చర్లకు చెందిన కొందరు సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజుకో నాయకుడు వస్తున్నాడని, సీనియర్ నాయకులుగా తమ పాత్ర ఏంటి అని కొందరు మల్లురవిని నిలదీశారు. స్థానిక నాయకులకు సమాచారం లేకుండా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఒంటెద్దు పోకడపోతూ తమను అవమానపరుస్తున్నారని సీనియర్ నాయకుడు బాలవర్ద్ధన్గౌడ్ ఆరోపించాడు. కాంగ్రెస్ కార్యకర్త కాలు విరిగితే ఎవరు పట్టించుకున్నారంటూ మల్లురవిని నిలదీశాడు. తమను పట్టించుకోని పార్టీలో ఎందుకు ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో కాంగ్రెస్ నాయకుడు అనిరుధ్రెడ్డి వర్గీయులు బాలవర్ద్ధన్గౌడ్ మాటలకు అడ్డుతగిలారు. దీంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగి.. సభావేదికపై ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ తరుణంలో మల్లురవి కార్యకర్తలను సముదాయించేందుకు యత్నించారు. చివరకు పోలీసులు అక్కడికి చేరుకుని పంపించారు. జడ్చర్ల పట్టణ, మండల అధ్యక్షులకు సమాచారం లేకుండా సమావేశాన్ని నిర్వహించారని పట్టణ అధ్యక్షుడు మీనాజ్ తెలిపారు.