నిజరూప దర్శనం సర్వ పాపహరణం
జోగుళాంబ దర్శనానికి భక్తుల క్యూ
వైభవంగా సహస్ర ఘటాభిషేకం
ఆకట్టుకున్న గ్రామ దేవత వేషధారణలు
అలంపూర్ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు
అలంపూర్, ఫిబ్రవరి 6: అమ్మల గన్న అమ్మ..జగజ్జనని పాహిమాం.. పాహిమాం…అంటూ భక్తులు దైవ చింతనలో భక్తి పారవశ్యంతో జోగుళాంబను ఆరాధించారు. అమ్మవారి నిజరూప దర్శన భాగ్యంతో భక్తులు పరవశించి పోయారు. కొంత మంది భక్తలు పూనకంతో ఊగిపోయారు. మాపై దయ ఉంచి మా పిల్లా పాపలను చల్లంగా చూడమ్మా అంటూ రెండు చేతులెత్తి వేడుకున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల చివరి రోజు అలంపూర్ క్షేత్రం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠమైన జోగుళాంబ అమ్మవారు ఆదివారం శ్రీ వసంత పంచమి సందర్భంగా భక్తులకు నిజరూప భాగ్యం కల్పించారు. 5రోజులుగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి అశేష భక్తజనం తరలివచ్చారు. ఈ సందర్భంగా జోగుళాంబ దేవి ముఖ మండపంలో ఆలయ అర్చకులు వెయ్యి కలశాలతో సహస్ర ఘటాభిషేకాలకు ప్రత్యేక పూజలు చేశారు.
1108 కలశాలతో భక్తులు తీసుకొచ్చిన పవిత్ర జలంతో అమ్మవారి మూల విరాట్ను ఆలయ అర్చకులు అభిషేకించారు. జోగుళాంబ సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ, ఉపాధ్యక్షుడు బండారు బాబు, గౌరవాధ్యక్షుడు బండారి శ్రీనివాస్ తమ సొంత ఖర్చుతో పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు ప్రాంతం కళాకారులతో ఊరేగింపుగా నిర్వహించారు. తుంగభద్రానదీ తీరం హరిశ్చంద్ర ఘాట్లో వెలిసిన ఘంటలేశ్వరాలయం నుంచి గ్రామ దేవతల అలంకరణతో ఊరేగింపు మొదలై జోగుళాంబ ఆలయం చేరుకున్నారు. జోగుళాంబ సేవా సమితి ఆధ్వర్యంలో బండారి శ్రీనివాసులు, వెంకన్న బాబు కుటుంబ సభ్యులు అమ్మవారికి చీరె, సారె, పట్టు వస్ర్తాలు సమర్పించారు. వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని జోగుళాంబ సేవా సమితి, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. భీమవరం గ్రామస్తులు, ఆలయ మాజీ ధర్మకర్త వెంకట నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు రూ.మూడు లక్షలతో భక్తులకు ఉచితంగా 25వేల లడ్డూలను పంపిణీ చేశారు.
ఆలయంలో ప్రముఖులు
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఎమ్మెల్యే అబ్రహం, జెడ్పీ చైర్ పర్సన్ సరితతిరుపతయ్య, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రాణీ కుముదినీ దేవి, డాక్టర్ అజయ్కుమార్, టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ అధికారి ప్రతినిధి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ వెంకటేశ్, ఆలయ ఈవో పురేందర్ కుమార్, మహబుబ్నగర్ సెకండ్ ఏడీజే ఉమాదేవి, గద్వాల సివిల్ జడ్జి ప్రశాంతి, ఫ్యామిలీ కోర్టు జడ్జి రాధిక, అలంపూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కవిత, స్పెషల్ బెంచ్ డీసీపీ, సెంట్రల్ జోన్ శ్రీనివాస్, డీఎస్పీ రంగస్వామి, సీఐ సూర్యానాయక్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు దర్శించుకున్నారు.
గట్టి బందోబస్తు
అలంపూరు సీఐ, ఎస్సై శ్రీహరి నేతృత్వంలో ఉత్సవాల్లో బందోబస్తు నిర్వహించారు. సుమారు 60 మంది పోలీసులు ఉత్సవ బందోబస్తులో పాల్గొన్నారు. సుమారు 10వేల మందికిపైగా భక్తులు దర్శించుకుని ఉండొచ్చని అధికారులు తెలిపారు.