అయిజ, డిసెంబర్ 15: సైబర్ నేరాలపై విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సీసీఎస్ ఎస్సై కేశవరావు సూచించారు. గురువారం పట్టణంలోని అరోరా కళాశాలలో షీ టీం, భరోసా కేంద్రం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, చైల్డ్ లైన్ అధికారులు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ నిర్మూలన, మానవ అక్రమ రవాణా తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కళాశాలల్లో విద్యార్థులు కలిసిమెలసి ఉండాలని, సీనియర్స్, జూనియర్స్ తేడాలేకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ లక్ష్యంతో కష్టపడి చదువుకోవాలన్నారు. బాల్యవివాహాలు చేసుకొని భవిష్యత్తును నాశనం చేసుకోరాదన్నారు. బాల్యవివాహాలు, మానవ అక్రమ రవాణాపై సమాచారం ఉంటే మా దృష్టికి తీసుకురావాలన్నారు. సైబర్ నేరాలు మానవాళికి పెనుసవాలుగా మారుతున్నాయని, సెల్ఫోన్లు అవసరం మేరకు ఉపయోగించాలన్నారు.
ఎవరూ సైబర్ నేరాలకు గురికావద్దన్నారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెస్సేజ్లకు స్పందించరాదన్నారు. బ్యాంకు అధికారులమంటూ ఎవరైన ఫోన్లు చేసి అకౌంట్ వివరాలు అడిగితే చెప్పరాదన్నారు. సీనియర్లు, జూనియర్లు అంటూ ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైన షీ టీం నెంబరుకు సమాచారం అందిస్తే చట్టపరమైన చర్యలు చేపడుతామన్నారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజలు ఏ అవసరం వచ్చినా 100కు డయల్ చేయాలని సూచించారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలకు భరోసా కేంద్రం అందిస్తున్న సేవలను వివరించారు. కార్యక్రమంలో షీ టీం, భరోసా కేంద్రం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.