ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
కేటిదొడ్డి, ఫిబ్రవరి 12: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో సబ్స్టేషన్ ప్రారంభం, ఆయా గ్రామాల రైతులకు ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల హాజరై రైతులకు 96 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు నేటికీ దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలన్నీ చూస్తే రైతు సంక్షేమం కోసం అత్యధిక తపనపడే ప్రభుత్వం, రాష్ట్రం ఏదైనా ఉందంటే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. సాగుసంబురంగా మార్చడానికి యుద్ధప్రాతిపదికన ప్రాజెక్ట్లు నిర్మించారని కొనియాడారు. విద్యుత్ సమస్యను త్వరలోనే అధిగమించి 24గంటల ఉచిత విద్యుత్ అందించారన్నారు. రైతుబీమా, పెట్టుబడి సాయం ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెందుతున్నదన్నారు.
సాగుకు విద్యుత్ ఉచితంగా ఇవ్వడమే ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంటే రైతుల వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించి పైసలు వసూలు చేయడమే ఎజెండాగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. రైతు ఉత్పత్తులు కొనాలని రాష్ట్రం అంటే కొనమని రైతులపై దాడిచేసి, దొంగచట్టాలతో రైతుల మెడలను కార్పొరేటర్ల దగ్గర తాకట్టు పెట్టాలని కేంద్రం చూస్తుందన్నారు. అయినా సీఎం కేసీఆర్ దెబ్బతో నల్లచట్టాలు డొల్ల చట్టాలుగా కొట్టి వేయబడ్డాయని కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి, ఎంపీపీ మనోరమ, వైస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, గద్వాల మార్కెట్ యార్డు చైర్పర్సన్ రామేశ్వరమ్మ, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు విజయ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు హనుమంతు, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు ఆంజనేయులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఉరుకుందు, సర్పంచ్ పావని, యూత్ మండలాధ్యక్షుడు శేఖర్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, ఆలయ కమిటీ డైరెక్టర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.