మంత్రులు సబితాఇంద్రారెడ్డి, హరీశ్రావు
మనఊరు-మనబడిపై కలెక్టర్లు, జెడ్పీచైర్పర్సన్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
గద్వాల, ఫిబ్రవరి 12: ప్రభుత్వ పాఠశాలలకు అన్నిహంగులు సమకూర్చుతూ విద్యా వ్యవస్థను మరింత పటిష్టపర్చేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమాన్ని ఉద్యమస్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లి ఒక యజ్ఞంలా చేపట్టి విజయవంతం చేయాలని విద్యాశాఖ, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, హరీశ్రావు పిలుపునిచ్చారు. శనివారం రంగారెడ్డి కలెక్టర్రేట్ కోర్టుహాల్ నుంచి మన ఊరు-మనబడి కార్యక్రమంపై కలెక్టర్లు, జెడ్పీచైర్పర్సన్లు, విద్యాశాఖ, ఆయా శాఖ అధికారులతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములపై అంకితభావంతో పనిచేయాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించేందుకు ప్రభుత్వం మనఊరు-మనబడి కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించిందని చెప్పారు. దీనిద్వారా 60శాతం విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను సమాన నిష్పత్తిలో ఎంపిక చేస్తూ మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంతో కార్పొరేట్ స్కూళ్లను మరిపించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. అవసరమైన చోట మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణాలు, లైబ్రరీ, ప్రహరీ, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, నీటివసతి, విద్యుత్, డిజిటల్ విద్యాబోధనకు సంబంధించిన తదితర పనులు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో రూ.3497కోట్లు వెచ్చిస్తూ 9,123 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేయడానికి నిర్ణయించినట్లు చెప్పారు. ఏఏ పాఠశాలల్లో ఏ పనులు చేయాలో గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో బడులను సందర్శించాలని కలెక్టర్లకు సూచించారు. అత్యధికంగా 790 నుంచి మొదలుకుని వందకు పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలను తొలివిడుతలో ఎంపిక చేయాలని చెప్పారు. పాఠశాల నిర్వహణ కమిటీతో అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేయాలని ఎస్ఎంసీ చైర్మన్తోపాటు సర్పంచ్, హెచ్ఎం, ఇంజినీరింగ్ విభాగం ఏఈలు సభ్యులుగా ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు, జెడ్పీచైర్మన్లు, ఎమ్మెల్యేలతోపాటు జెడ్పీటీసీలు, స్థానిక సంస్థల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. విరాళాలు అందించేందుకు ఎన్ఆర్ఐలు, పూర్వవిద్యార్థులు, దాతలను ప్రోత్సహించాలని, వారి ఆర్థిక సహకారంతో బడులు మరింత అభివృద్ధి చేసుకోగలుగుతారని తెలిపారు. రూ.పది లక్షలు విరాళం ఇస్తే తరగతి గదికి వారిపేరు పెట్టవచ్చన్నారు. రూ.25లక్షలు విరాళం అందిస్తే పాఠశాలలోని ఓ విభాగం మొత్తానికి వారిపేరు పెట్టాలని సూచించారు.
ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యను అభివృద్ధి చేసేవిధంగా దృష్టి పెట్టాలని, రాష్ట్రంలోని గురుకులాల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలన్నారు. అత్యవసరంగా ప్రతిమండలానికి ఒక ఏజెన్సీ ఏర్పాటు చేయాలని, ఒక్కో మండలానికి ఏజెన్సీ ఉంటుందని, మంత్రి ఆధ్వర్యంలో కలెక్టర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విద్యను అభివృద్ధి చేయడానికి మన ఊరు-మనబడి కార్యక్రమం మొదలు పెట్టిందని చెప్పారు. పాఠశాలలకు మౌలిక వసతులు, నిర్మాణాలు చేపట్టే విషయంలో నాణ్యతతో పనులు చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అంగన్వాడీ సెంటర్లు అద్దే భవనాల్లో నడుస్తున్నందున భవనాల నిర్మాణం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు ఈ కమిటీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మండల విద్యాధికారులు, హెచ్ఎంలు కార్యక్రమంలో పాల్గొని పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతివారం ఎంపిక చేసుకున్న పాఠశాలను సందర్శించి ఎన్ఆర్ఈజీఎస్, ఇతర పనులు ఏవైనా ఉంటే వాటిని గుర్తించి చేయించేలా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో టాయిలెట్లకు నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో హాజరుశాతం ఎక్కువగా ఉండేలా వారి తల్లిదండ్రులను ప్రోత్సహించాలని మండల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, డీఆర్డీవో ఉమాదేవి, డీఈవో సిరాజుద్ధీన్, జెడ్పీసీఈవో విజయనాయక్, సీపీవో లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.