గద్వాలటౌన్, ఏప్రిల్ 27 : జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆయా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భజరంగ్దళ్ ఆధ్వర్యంలో స్వామి వారి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కోటలోని స్వయంభూ లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనమాన్ చాలీసా పఠనం చేశారు.
ధరూర్ మండలంలో..
ధరూర్, ఏప్రిల్ 27: మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. మండలకేంద్రంలో అడవి ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు హోమం జరిపించి, ఆంజనేయస్వామికి పూజలు చేశారు.
మల్దకల్లో..
మల్దకల్, ఏప్రిల్ 27 : మండల కేంద్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంతోపాటు అడవి ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు మధుసూదన్ చారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే హనుమత్ వ్రతం, సత్యనారయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, రాఘవేంద్రరావు, బాబురావు, నాగరాజాచారి, వెంకోబరావు, దీరేంద్రదాస్, రవిచారి, గురునాథ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.