అయిజ, డిసెంబర్ 1 : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కృషి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత ఉపాధ్యాయుల కు సూచించారు. 50వ రాష్ట్ర బాల వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శనను పురస్కరించుకొని గురువారం పట్టణంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి ప్రదర్శన నిర్వహించారు. భారత అణుపితామహుడు హోమి జహంగీర్బాబా చిత్రపటానికి ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి సరిత నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆలోచనలకు అనుగుణంగానే ఉన్నత చ దువులు ఎంచుకోవాలన్నారు.
కలలను పట్టుదలతో నెరవేర్చుకోవాలన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ జిల్లాస్థాయితోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తాచాటి తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అబ్దుల్కలాంను ఆదర్శంగా తీసుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నా రు. కాగా, జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 436 ప్రదర్శనలు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
శనివారం వరకు ప్రదర్శన కొనసాగనున్నది. సాం స్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దేవన్న, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సువర్ణ, డీఈవో మహ్మద్ సిరాజుద్దీన్, జిల్లా సైన్స్ అధికారి భాస్కర్ పాపన్న, డీసీఈబీ కార్యదర్శి ప్రతాప్రెడ్డి, ఎంఈవో నర్సింహులు, సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్రెడ్డి, ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ సీతారాంరెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్ రాముడు, ఎంఈవోలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.