తుంగభద్రా నదికి పోటెత్తుతున్న వరద
27.481 టీఎంసీలకు చేరిన డ్యాం
జలకళను సంతరించుకున్న ఆర్డీఎస్
రాజోళి సుంకేశుల డ్యాంకు 10,100 క్యూసెక్కులు
శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో
వానకాలం సాగుకు సన్నాహాలు
తుంగభద్రా నదికి వరద ప్రారంభమైంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో టీబీ డ్యాంకు నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఆదివారం ఇన్ఫ్లో 26,858 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 255 క్యూసెక్కులుగా నమోదైంది. అలాగే ఆర్డీఎస్ జలకళను సంతరించుకున్నది. తుంగభద్రా నదికి వరద పోటెత్తుతుండడంతో ఆనకట్టకు 10,743 క్యూసెక్కులు వచ్చి చేరాయి. దీంతో ప్రధాన కాల్వకు 643 క్యూసెక్కులు, 10,100 క్యూసెక్కులు దిగువన ఉన్న సుంకేశుల బ్యారేజీకి చేరుతున్నాయి. ఆర్డీఎస్లో ప్రస్తుతం 9.1 అడుగుల నీటి నిల్వలు ఉన్నాయి. అలాగే శ్రీశైలం జలాశయానికి వరద రాక మొదలైంది. ముందస్తు వరద రావడంతో నదీతీర ప్రాంత రైతులు నారుమళ్లు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అయిజ, మే 22: ఆర్డీఎస్ (రాజోళి బండ డైవర్సన్ స్కీం)కు జలకళ సంతరించుకున్నది. కర్ణాటకలో వరుణుడు ముందుగానే పలకరించడంతో తుంగభద్ర నదికి వరద ప్రవాహం పోటెత్తుతున్నది. రెండు రోజులుగా ఆర్డీఎస్ ఆనకట్ట ఎగువ ప్రాంతంలో భారీ వానలు కురుస్తుండటంతో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద చేరుతున్నది. ఆదివారం ఆర్డీఎస్ ఆనకట్టకు 10,743 క్యూసెక్కుల వరద చేరుతుండగా, ప్రధానకాల్వకు 643 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 10,100 క్యూసెక్కుల వరద నీరు దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నాయి. ఆర్డీఎస్ ఆనకట్టలో ప్రస్తుతం 9.1 అడుగుల నీటిమట్టం నిల్వ ఉన్నది. తుంగభద్ర నదికి వరద రావడంతో నదీతీర ప్రాంత రైతులు నారుమళ్లు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదికి వరద ముందస్తుగా రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘ఏరు ముందో.. ఏరువాక ముందో’ అన్న నానుడి ప్రస్తుత ఏడాది నిజం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్ర నదులకు ఏరువాక పండుగ కంటే ముందుగానే వరదలు వస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని ఇక్కడి రైతుల నమ్మకం. రైతుల నమ్మకాన్ని వరుణుడు నిజం చేయడంతో రైతులు ముందస్తుగానే వానకాలం సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
తుంగభద్ర జలాశయానికి..
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం (టీబీ డ్యాం)కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద నీరు డ్యాంలోకి చేరుతున్నది. ఆదివారం ఇన్ఫ్లో 26,858 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 255 క్యూసెక్కులు నమోదైంది. టీబీ డ్యాం 100.855 గరిష్ట నీటినిల్వ సామర్థ్యానికి గానూ, ప్రస్తుతం 27.481 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1633 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి గానూ, ప్రస్తుతం 1605.56 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు టీబీ బోర్డు ఎస్ఈ నాగమోహన్, డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
శ్రీశైలం జలాశయానికి..
శ్రీశైలం, మే 22: కృష్ణానది పరివాహక ఎగువ ప్రాంతమైన కర్ణాటక నుంచి శ్రీశైల ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతున్న ది. గతేడాది కంటే ఈ ఏడాది వరదలు ముందుగానే ప్రారంభమయ్యాయి. సుంకేసుల నుంచి 10,820క్యూసెక్కులు వస్తున్నది. ప్రాజెక్టు నీటిమట్టం 885అడుగులు కాగా, ప్రస్తుతం 812.80అడుగులకు చేరింది. నీటినిల్వ సామర్ధ్యం 214టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 35.9850 టీఎంసీలు ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.