బంకు సిబ్బంది అప్రమత్తం.. తప్పిన పెను ప్రమాదం
జడ్చర్లటౌన్, జూన్ 26 : పట్టణంలోని శ్రీనివాస థియేటర్ సమీపంలోని పెట్రోల్బంకులో ఓ ద్విచక్రవాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే బంకు సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వల్లూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య ఆదివారం మధ్యాహ్నం జడ్చర్లలోని శ్రీనివాస థియేటర్ ఎదురుగా ఉన్న పెట్రోల్బంకులో తన ద్విచక్రవాహనంలో పెట్రోల్ పోయించుకుంటున్నాడు.
ఈ క్రమంలో ద్విచక్రవాహనంలో ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడే ద్విచక్రవాహనాన్ని కిందపడేసి పరుగులు తీశాడు. విషయాన్ని గుర్తించిన పెట్రోల్ బంకు సిబ్బంది అప్రమత్తమై మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. దీంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. వేడిగా ఉన్న ద్విచక్రవాహనం ఇంజిన్పై పెట్రోల్ పడడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో బంకు సిబ్బంది ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పెను ప్రమాదం చోటుచేసుకునేదని స్థానికులు తెలిపారు.