వనపర్తి అర్బన్, ఆగస్టు 10 : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార యంత్రాంగం పోలింగ్ కేంద్రాల కూర్పుతోపాటు ఒకే కేంద్రంలో కుటుంబ సభ్యులు ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఓటరు నవీకరణ తుది దశకు చేరింది. ఈ నెల 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. మరోవైపు ఈవీఎం మొదటి దశ పరిశీలన పూర్తయ్యింది. ప్రస్తుతం ఈవీఎంల పనితీరుపై నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజలకు కళాజాత ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 290 పోలింగ్ కేంద్రాలు ఉండగా, కొత్తగా ఆరు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు.
రెండు కిలోమీటర్ల పరిధిలో పోలింగ్ కేంద్రం..
జిల్లాలోని వివిధ మండలాల్లోని ప్రజలకు ఓటు వేసేందుకు సౌకర్యంగా ఉండేందుకు ఇంటి నుంచి కనీసం రెండు కిలోమీటర్ల పరిధిలో పోలింగ్ కేంద్రం ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించకునేలా చర్యలు తీసుకుంటున్నారు. 1,500కి మించి ఉంటే అదనంగా మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. దీంతో నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఆదనంగా మరో పోలింగ్ కేంద్రం పెంచునున్నారు. ఈ ప్రతిపాదనలను ఎన్నికల సంఘానికి నివేదించారు. అక్కడి నుంచి అనుమతి వచ్చిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తారు.
వసతులపై ప్రత్యేక దృష్టి..
జిల్లాలోని పోలింగ్ కేంద్రాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో ఏయే వసతులు ఉన్నాయో నమోదు చేసుకుంటున్నారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం, వెలుతురు. ర్యాంపులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీ వివరాలను ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాలు శిథిల భవనాల్లో ఉన్నట్లయితే సమీపంలోని మరో కొత్త భవనంలోకి మార్చడానికి చర్యలు చేపడుతున్నారు. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో పరిశీలన చేసిన తర్వాత అవసరమై వసతులను సమకూర్చునున్నారు.
స్థానాల మార్పు..
జిల్లాలో ఇప్పటి వరకు 290 పోలింగ్ కేంద్రాలు ఉండగా, అన్ని మార్పుల తర్వాత వీటి సంఖ్య 296కు చేరుకుంది. 6 పోలింగ్ కేంద్రాల స్థానాలకు ప్రతిపాదనలు పంపించారు. వీటిలో ఘనపురం మండలంలోని కర్రెనతండా, గట్టుకాడిపల్లి, కోతలకుంట తాండ, వనపర్తి మండలంలో శ్రీనివాసపురం కాలనీలో జంగల గుట్ట ప్రాథమిక పాఠశాలలో, దత్తాయిపల్లి పెద్దతండాలో, అలాగే పెబ్బేర్ మండలంలోని కంచిరావుపల్లిలోని తండాలో కొత్తగా పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా 12పోలింగ్ కేంద్రాల స్థానాలు మారునున్నాయి. వాటిలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, ఇతర సమస్యలున్న భవనాలు, వేరే చోటికి మార్చనున్నారు. వీటిలో ఘనపురం మండలంలోని షాఫూర్ పోలింగ్ కేంద్రాన్ని ఆముదబండ తండా ఎంపీఎస్కు, మామిడివాడలోని పోలింగ్ కేంద్రాన్ని వెన్కితండాకు, ఎంపీఎస్ ముందరితండాలోకి, వనపర్తి మండలంలోని చిట్యాల ఎంపీఎస్ నుంచి చిట్యాల పడమటి తండాకు, బాలుర జూనియర్ కళాశాలలోని రెండు పోలింగ్ కేంద్రాలను బాలికల జిల్లా పరిషత్ పాఠశాలకు, పాత మార్కెట్ యార్డు నుంచి గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళశాలకు, పాత డ్వాక్రా భవనం నుంచి పీఆర్ సబ్ డివిజన్ కార్యాలయంలోకి, కేడీఆర్ ఎంఆర్సీ భవనం నుంచి రాంనగర్ కాలనీ ఎంపీఎస్కు, బండార్నగర్ ఎంపీఎస్ నుంచి ఐజనగర్లోని ఎంపీఎస్కు, రాజపేట ఎంపీఎస్ నుంచి పెద్దతండా ఎంపీఎస్కు, అప్పాయిపల్లి ఎంపీఎస్ నుంచి గుంత తండా ఎంపీఎస్లకు పోలింగ్ కేంద్రాల మార్పునకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఇందు కోసం గుర్తింపు పొందిన పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే స్థానాలు, పేర్లలో మార్పులు చేయడానికి నిర్ణయించారు. మరో పదిరోజుల్లోనే భారత ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాలకు ఆమోద ముద్ర వేసే అవకాశాలున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఓటర్లు జాబితాపై ఎన్నికల సంఘం దృష్టి సారించనున్నది.
ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాం..
జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నది. ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేస్తున్నాం. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. వనపర్తి నియోజకవర్గంలో ఆరు కొత్త పోలింగ్ కేంద్రాలు, 12 స్థాన మార్పులకు ప్రతిపాదనలు పంపించాం.
– రమేశ్రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు