జడ్చర్ల, డిసెంబర్ 16: యాసంగిలో రైతులు వరినారు పోసే సమయంలో జాగ్రత్తలు పాటించి నారు పెంచితే మంచి దిగుబడి వస్తుంది. ఈ ఏడాది వానకాలంలో వర్షాలు సంవృద్ధిగా కురవడంతో చెరువులు, కుంటలు అలుగులు పారాయి. భూగర్భజలాలు పెరగడంతో బోర్లు, బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉండటంతో రైతులు యాసంగిలో వరిసాగుపై మొగ్గు చూపుతున్నారు. వరి సాగుచేసే రైతులు నారుమడిలో యాజమాన్య పద్ధతులను పాటించి నారు పోసుకుంటే అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు తెలుపుతున్నారు. రైతులు జాగ్రత్తలు పాటించి నారుమళ్లను తయారు చేసుకుంటే బాగుంటుంది.
యాసంగిలో వరిసాగు చేసే రైతులు భూముల్లో అనువైన రకాలను ఎంచుకోవాలి. మొదట్లో చలి, వేసవిలో ఎండలు అధికంగా ఉంటాయి. త్వరగా కోతలకు వచ్చే రకాలను ఎంచుకొని నారు పోసుకుంటే మంచిది. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చే వరిపంట సాగుచేసుకోవాలి. జిల్లాలో యాసంగిలో ఆర్ఎన్ఆర్(తెలంగాణ సోన), ఎంటీయూ 1010, జేజీఎల్-18047(బతుకమ్మ), జేజీఎల్ 24423 రకాలు ఇక్కడి పొలాలకు అనువైన వరి రకాలు. ఇవి త్వరగా చేతికందడమే కాకుండా మంచి దిగుబడులు వస్తాయని అధికారులు చెబుతున్నారు.
యాసంగిలో సాగు చేసే రైతులు వరినారు పోసుకునేందుకు నవంబర్ మూడో వారం నుంచి డిసెంబర్ 20వరకు సమయం ఉంది. ఎక్కువగా నవంబర్ నెలలో నారు పోసుకుంటే త్వరగా నాటే అవకాశం ఉంటుంది. ముందుగా నాటడం వల్ల ఎండల తాకిడి తక్కువగా ఉంటుంది. నీటి ఇబ్బందులు కూడా అంతగా ఉండవు.
యాసంగిలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో రైతులు నారుమడి తయారులో జాగ్రత్తలు తీసుకోవాలి. నారుమడిని రెండు, మూడుసార్లు దమ్ముచేయాలి. నీళ్లు పూర్తిగా బయటకు వెళ్లేలా నారుమడిని తయారు చేయాలి. వరి మొలక చల్లిన తర్వాత మరుసటి రోజు ఉదయం నీళ్లు పూర్తిగా తీసివేయాలి. రాత్రి వేళల్లో నీళ్లు నిండుగా ఉంచి ఉదయం తీసివేసి మరలా నీళ్లు పెట్టాలి. నారు పోసిన తర్వాత నారు ఎర్రగా మారితే జింక్ లోపం ఉంటే లీటర్ నీటికి 2గ్రాముల జింక్ సల్ఫేట్, గ్రాము కార్బండిజం కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. నారు బాగా పెరగడానికి పైపాటుగా యూరియా వేస్తే మంచిది. 28రోజుల తర్వాత నాటాలి. 28రోజుల లోపు వయస్సు ఉన్న వరినారు నాటడం వల్ల త్వరగా కోలుకొని అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. నారు నాటడానికి వారం రోజుల ముందు నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు వేయాలి. అవి వేయడం వల్ల కాండం తొల్చే పురుగు నుంచి కాపాడుతుంది.
యాసంగిలో వరి సాగుచేసే రైతులు నారు పోసుకునే ముందు జాగ్రత్తలు పాటించాలి. యాసంగిలో నారు పోసుకునే సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. నవంబర్ మూడో వారం నుంచి డిసెంబర్ 20లోగా పోసుకోవాలి. అదును తప్పితే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. రాత్రి వేళలో చలి అధికంగా ఉండటం వల్ల రైతులు నారుమడిలో నీళ్లు నిండుగా ఉంచి ఉదయం పూర్తిగా తీసివేసి మరలా నీళ్లు పెట్టాలి. రైతులు వ్యవసాయశాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటించి నారు పోసుకుంటే అధిక దిగుబడి వస్తుంది. డ్రమ్సీడర్ ద్వారా వరి సాగుచేస్తే బాగుంటుంది.
– గోపినాథ్, వ్యవసాయ అధికారి, జడ్చర్ల మండలం