గద్వాల, ఏప్రిల్ 2 : జిల్లాలో రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరందక ఎండిపోతున్నాయని, పంటల నష్టాన్ని అంచనా వేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు మంగళవారం కలెక్టర్ సంతోష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు రూ. 25వేలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వరితో పాటు వివిధ పంటలకు మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని ఇచ్చిన హామీని వానకాలం నుంచే అమలు చేస్తామని చెప్పినా.. ఇప్పటికీ అమలుచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి పంటలకు బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
అధికారంలోకి రాగానే రైతుబంధుతో పాటు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నేటికీ అమలు చేయకుండా.. సీఎం, మంత్రులు ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఎంపీపీలు రా జారెడ్డి, ప్రతాప్గౌడ్, విజయ్, జెడ్పీటీసీలు ప్రభాకర్రెడ్డి, రాజశేఖర్, వైస్ఎంపీపీ సుదర్శన్రెడ్డి, నా యకులు రమేశ్నాయుడు, రాధాకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన అన్ని మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.