గట్టు, మే 13 : అయిజ పట్టణంలోని శ్రీలక్ష్మీ నరసింహ ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, రబ్బర్ స్టాంపులు, ఫోర్జరీ సంతకాల కలకలం జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దందా ఇతర ప్రాతాల్లో వెలుగు చూడగా తాజాగా నడిగడ్డలోనూ తెరలేవడం చర్చనీయాంశంగా మారింది. అన్ని రంగాల్లో పేరున్న ఈ ప్రాంతానికి మాయని మచ్చగా మిగిలింది. ఇదిలా ఉండగా ఈ నకిలీ పత్రాలు జోగుళాంబ గద్వాలలోని అయిజ, గట్టు తదితర మండలాలతోపాటు ఏపీ, కర్ణాటకకు చేరడం జిల్లా యంత్రాంగాన్ని కలవరపెడుతోంది.
ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారానికి గట్టు మండలానికే ఎక్కువ సంబంధం ఉందని తెలుస్తోంది. నకిలీ ధ్రువీకరణ పత్రాలతోనే పైరవీకారులు, అనర్హులు ప్రభుత్వ పథకాలకు లబ్ధి చేకూర్చారనే వాదనలు వినబడుతున్నాయి. వీటిని ఎక్కువగా కల్యాణలక్ష్మి పథకానికే వినియోగించారని సమాచారం. ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ ఎస్ఎస్సీ మెమోలు, బోనఫైడ్లు, ఏజ్, మ్యారేజీ సర్టిఫికెట్లతోపాటు గ్రామ పంచాయతీల రౌండ్ సీళ్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పాఠశాలల హెచ్ఎంల సీళ్లు కూడా లభించడం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. కల్యాణలక్ష్మి పథకంలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు జతచేసి అనర్హులు, పైరవీకారులు నాకు సగం.. నీకు సగం అన్నట్లుగా అందినకాడికి దోచుకున్నట్లు ప్రచారం జోరందుకున్నది.
ఈ పథకంలో రూ.లక్షల్లో ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు లేకపోలేదు. విరాసత్(సక్సెషన్)తోపాటు ఇతర పథకంలో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. కొంతకాలం కిందట ఇందువాసిలో అక్రమ విరాసత్ బాగోతం బయటపడింది. ‘చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్లు’ అధికారులు మేల్కొని ఈ విరాసత్కు సంబంధించి అర్హుడికి పట్టామార్పిడీ చేశారు. తాజాగా ఇటీవల మండలంలోని తారాపురంలో కూడా అక్రమ విరాసత్ బాగోతం బయటపడింది. కొన్ని విరాసత్లలో కూడా నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు జతపర్చారనే వాదనలు వినబడుతున్నాయి.
రైతుబీమాలో లబ్ధిలో కూడా అవసరమయ్యే నకిలీ పత్రాలు అధికారులకు ఇచ్చి వారిని తప్పుదోవ పట్టించి అనర్హులు, పైరవీకారులు నిధుల స్వాహా చేశారనే ఆరోపణలు చేసుకున్నాయి. కాగా పై చదువులు, ఉద్యోగావకాశాలకు నకిలీ విద్యార్హతల సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తెలుస్తుండడంతో అర్హులు నష్టపోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ నకిలీ ధ్రువీకరణ పత్రాలు ఏపీ, కర్ణాటకకు కూడా చేరడం సంచలనంగా మారింది. ఈ నకిలీల వ్యవహారంలో తాజా, మాజీ ప్రతినిధులతోపాటు పైరవీకారుల ప్రమేయం ఉన్నదని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై ఇటీవలనే విచారణ ప్రారంభమైనట్లు తెలిసింది. ఇందులో భాగంగా సంబంధముందని అనుమానమున్న వారిని పిలిపించి ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. సమగ్ర విచారణ జరిగితే బాధ్యులెవరనెది తేలనున్నది. కాగా ఈ నకిలీ వ్యవహారంపై కలెక్టర్ సీరియస్గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా మూడు రాష్ర్టాలకు ముడిపడి ఉండడంతో పోలీసులు దీని గుట్టు విప్పాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు వినికిడి. ఇదిలా ఉండగా కలెక్టర్ స్పందించి నకిలీలల గుట్టు విప్పి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తాసీల్దార్ను కలిసిన అయిజ ఎస్సై..
గట్టు తాసీల్దార్ విజయ్కుమార్ను అయిజ ఎస్సై కేటీ మల్లేశ్ మంగళవారం కలిశారు. ఈ వ్యవహారంపై ఆయనతో మాట్లాడారు. 2021 నుంచి 2025 ఏడాది వరకు కల్యాణలక్ష్మి ఫైళ్ల నకళ్లను ఇవ్వాలని ఎస్సై తాసీల్దార్ను లేఖ రూపంలో కోరారు. ఇదిలా ఉండగా నాలుగైదు రోజుల్లో పోలీసుల చెంతకు చేరనున్నాయి. కాగా ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు, పోలీసులు ధ్రువీకరించారు.