మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 2 : రాష్ట్రంలోని అన్ని మతాలను ఆదరించే సెక్యులర్ ప్రభుత్వం మాది అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అందుకే అందరి సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 48వ వార్డు పరిధిలోని క్రిస్టియన్ కాలనీ, సుభాశ్నగర్లో సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి ఓల్డ్ మోతీనగర్లో మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక మైనార్టీలకు మంచిరోజులు వచ్చాయన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, మార్కెట్ కమిటీ, డీసీసీబీ చైర్మన్ పదవులు ఇచ్చి వారిని గౌరవించామని చెప్పారు. పాలమూరు మౌలాలీ గుట్ట సమీపంలో రూ.50 లక్షలతో మినీ హజ్ నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. 200కుపైగా మైనార్టీ గురుకులాల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తుంటే ఓర్వలేక కొందరు దుర్మార్గులు కుట్ర రాజకీయాలకు తెర లేపుతున్నారని తెలిపారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొన్ని పార్టీల నాయకులు ఎన్నికల సమయం రాగానే ప్రజలు గుర్తుకొస్తారని, కులం, మతం పేరిట రాజకీయాలు చేసేందుకు యత్నిస్తారని ధ్వజమెత్తారు.
అలాంటి వారిని ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కులమతాలకతీతంగా మనమంతా కలిసి ముందుకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్లో గురులాలల విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ, రాష్ట్ర భవిష్యత్కు వారు పునాదులు కావాలని కోరారు. గతంలో పట్టణంలో తాగునీరు దొరకని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం మిషన్ భగీరథ నీరు ఇంటింటికీ సరఫరా అవుతున్నాయని తెలిపారు. 36వ వార్డులో రూ.2.50 కోట్లతో సీసీ, డ్రైన్ నిర్మాణం, రూ.2 కోట్లతో గోదాం రోడ్డు పునఃనిర్మాణం, రూ.20 లక్షలతో దూద్ దవాఖాన నిర్మిస్తామని చెప్పారు. అనంతరం మోతీనగర్లో మసీద్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. ప్రతి వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజివెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటిగణేశ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు ఖాజాపాషా, రషాద్ఖాన్, షఫీ, ఫాతిమా, రసూలా, నౌషిన్, నాయకులు
పాల్గొన్నారు.