గ్రామాల్లో పరుగులు పెడుతున్న అభివృద్ధి
పేదలకు బ్యాంకర్లు సహకరించాలి
నాడు.. నేడు ఇస్తున్న రుణాలను బేరీజు వేయాలి
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
హజ్హౌస్ నిర్మాణం పూర్తి చేయాలి
క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, జూన్ 8 : అందరికీ సముచిత స్థా నం కల్పిస్తూ ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని బలోపేతం చేస్తున్నామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్ ఫంక్షన్హాల్లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కస్టమర్ అవుట్ రీచర్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ఏడా ది బ్యాంకుల నుంచి రూ.5,500 కోట్ల రుణాలు అం దించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధించేందుకు నిరంతరం గ్రామాల్లో నిధులుండేలా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారన్నారు. దీంతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. గడిచిన ఐదేండ్లలో రాష్ట్రం లో బ్యాంక్ ఉన్న ప్రతి గ్రామంలో రూ.25 కోట్ల టర్నోవర్ జరిగినట్లు వివరించారు.
వీటిని దృష్టిలో ఉంచుకుని బ్యాంకర్లు గ్రామీణలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలలో నిరుపేదలకు సహకారం అందించాలన్నారు. రూ.3561 కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వాల్సి ఉన్నా అత్యధికంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వినియోగదారులు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు పూర్తి సహకారం అందించాలన్నారు. 2014 ఏడాదికంటే ముందు ఇచ్చిన రుణాలకు, నేటి ప్రభుత్వం అందిస్తున్న రుణాలను ఒక్కసారి బేరీజు వేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో రెండు గ్రామాలకు ఒక బ్యాంక్ వస్తుందన్నారు. రుణాల మంజూరులో దళారుల ప్రమేయం ఉండకూడదని, ఎక్కడైనా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, లీడ్బ్యాంక్ జిల్లా మేనేజర్ నాగరాజారావు, గొర్రెల కాపారుల సంఘం జిల్లా అధ్యక్షుడు బాలరాజు యాదవ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ రహెమాన్, ఏపీజీవీఆర్ఎం సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడాభివృద్ధికి కృషి
మహబూబ్నగర్ టౌన్, జూన్ 8 : రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. కింగ్షోటోకాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కరాటే శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం బుధవారం జిల్లా కేంద్రంలోని హెచ్బీ ఫం క్షన్హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మరక్షణకు కరాటే నేర్చుకోవాలని సూచించారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. రూ.17 కోట్లతో క్రీడా మైదానాలు అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ప్రధాన స్టేడియం మైదానంలో మల్టీపర్పస్, ఇండోర్ స్టేడియం పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అనంతరం విద్యార్థుల కరాటే విన్యాసాలను తిలకించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, కింగ్షోటోకాన్ క్లబ్ ఫౌండర్ జహంగీర్ పాషాఖాద్రీ, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్హదీ, క్లబ్ ప్రతినిధులు లక్ష్మణ్, మహ్మద్జకీ, రఫీక్ పటేల్, తిరుపతయ్య పాల్గొన్నారు.
హజ్హౌస్ నిర్మాణం పూర్తి చేయాలి
అన్ని వర్గాలు, మతాలు, కులాల సంక్షేమానికి సర్కార్ పాటుపడుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం ఆయన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నేషనల్ ఫంక్షన్హాల్లో జిల్లా నుంచి హజ్యాత్రకు వెళ్తున్న యాత్రికులకు వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. జిల్లా కేంద్రంలో మినీ హజ్హౌస్ నిర్మాణం కోసం 4 ఏండ్ల కిందట రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. పనుల్లో వేగం పెంచి ఆరు నెలల్లో పూర్తి చేయాలని ముస్లిం మతపెద్దలతో పాటు కాంట్రాక్టర్లను ఆదేశించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో మతకలహాలు, గొడవలు లేకుండా ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతున్నారని తెలిపారు. పవిత్ర హజ్యాత్రలో జిల్లా, రాష్ట్రం బాగుండాలని అల్లాను ప్రార్థించాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, హజ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు మహమూద్అలీ, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు అర్షద్అలీ ఖలీల్ అహ్మద్, డాక్టర్ రఫీక్, అజర్, హజ్ యాత్రికులు పాల్గొన్నారు.