ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాడెద్దులకు పూజలు
ఉత్సాహంగా ఏరువాక తాడు తెంచే ఉత్సవం
పురవీధుల్లో అలంకరించిన ఎడ్లతో ఊరేగింపు
కోటి ఆశలతో వానకాలం సాగుకు శ్రీకారం
పాడిపంటలు బాగా పండాలని రైతన్న పూజలు
గ్రామాల్లో బైలెల్లిన బోనాలు
మొక్కులు చెల్లించుకున్న భక్తులు
నెట్వర్క్ మహబూబ్నగర్, జూన్ 14 : ఏరువాక రైతుల పండుగ.. వర్షాకాలం ఆరంభంలో వచ్చే ఉత్సవం.. ఏరు అంటే ఎద్దులు.. వాక అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం చేయడమని అర్థం. మంగళవారం పౌర్ణమిని ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కాడెద్దులను నీటితో శుభ్రం చేసి వాటి శరీరంపై రంగులు అద్ది మెడలో దండలు, గవ్వలు, గంటలతో అలంకరించారు. వాటికి పూజలు చేసి ఫలహారాలు తినిపించారు.
పొలాలకు వెళ్లి నేలతల్లికి మొక్కి పంటలు బాగా పండేలా దీవించాలని ప్రార్థించారు. సాయంత్రం పురవీధుల్లో మేళతాళాల మధ్య ఊరేగించారు. ఆలయాల ఆవరణలో ఏరువాక తాడును తెంచారు. ఈ వేడుకల్లో కర్షకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే ఈదమ్మ, సుంకులమ్మ, మారెమ్మ, మాసమ్మ, కర్రెమ్మ, సవారమ్మ దేవతలకు బోనాలతో బైలెల్లారు. పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి కోళ్లను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.
మక్తల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హాజరై ఈ ఏడాది పంటలు బాగా పండాలని పూజలు చేశారు. ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో పిండి వంటలను చేసి ఆరగించారు. వ్యవసాయ పొలాల వద్ద పూజలు చేశారు.
మక్తల్టౌన్: ఆజాద్నగర్లో ఎద్దులబండ్ల ఊరేగింపు, ఎద్దులబండితో వస్తున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
మూసాపేట: కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ట్రాక్టర్లతో ఆలయ ప్రదక్షిణ
ఊట్కూర్: మూకి బసవేశ్వరాలయంలో శివుడికి అభిషేకం చేస్తున్న భక్తులు
ఊట్కూర్లో కాడెద్దులను ఊరేగిస్తున్న రైతులు