మహబూబ్నగర్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ కొత్త కలెక్టరేట్లో గురువారం నుంచి అధికారులు కొలువుదీరారు. ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ సమీకృత భవనాన్ని అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు ఇరుకుగదుల్లో చాలీచాలని టేబుళ్ల మీద పనులు నిర్వహించిన ఉద్యోగులు.. ఇక నుంచచి విశాలమైన గదుల్లో కార్యకలాపాలు చేపట్టనున్నారు. 62 శాఖలకు అవసరమైన భవనాలను సిద్ధం చేశారు. ప్రతి అధికారికి ప్రత్యేకమైన చాంబర్, ఉద్యోగులు కూర్చునేలా విశాలమైన స్థ లం కేటాయించారు.
ఆయా కార్యాలయాలు ఎక్కడ ఉ న్నాయో తెలిపేలా డిస్ప్లే ఏర్పాటు చేశారు. కాగా, కలెక్టర్ ఆదేశాలతో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్, ఆ యా భవనాల్లో ఉన్న కార్యాలయాలకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లు, బీరువాలు, కుర్చీలను రెండు రోజులుగా కొత్త కలెక్టరేట్కు తరలిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీ హబ్ ద్వారా కొత్త కలెక్టరేట్కు హై స్పీ డ్ డాటా ప్రొవైడ్ చేశారు. ప్రతి ఫ్లోర్లో నెట్ మానిటరింగ్ సెంటర్ ఉన్నది.
ప్రతి సోమవారం నిర్వహించే ప్ర జావాణిని ఈ నెల 12 నుంచి కొత్త కలెక్టరేట్లో నిర్వహించాలని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. ఇదిలా ఉండ గా, పాత కలెక్టరేట్ భవనం స్థానంలో కార్పొరేట్ స్థాయి దవాఖాన నిర్మించాలని యోచిస్తున్నారు. త్వరలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చేతులమీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. సొంత భవనాలు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, వాటిని వినియోగంలోకి తీసుకొస్తామని మంత్రి ప్రకటించారు.