రహదారులపై ఎలక్ట్రిక్ వాహనాలు రయ్.. రయ్మంటూ దూసుకెళ్తున్నాయి. పరిమిత వేగం.. తక్కువ బరువు, సులభ నిర్వహణ.. పర్యావరణ హితం.. వీటితోపాటు విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఈ-వెహికిల్స్ అంటే ఆల్ లైక్స్ అంటున్నారు. దీంతో మార్కెట్లో కార్లు,బైకులు, లగేజీ వాహనాల హవా కొనసాగుతున్నది. కొత్త కొత్త మోడల్స్ వస్తుండడంతో రోజురోజుకూ వాడకం పెరిగింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో షోరూంలు వెలిశాయి. కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతుండడంతో రోడ్లపై వందల సంఖ్యలో e-వాహనాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వాడకం మరింత పెరిగే అవకాశం ఉన్నది.
మహబూబ్నగర్, జనవరి 8: ఒకప్పుడు ఇంట్లోకి గ్యాస్ పొయ్యి తీసుకోండి.. కట్టెల బాధ నుంచి ఉపశమనం పొందండి.. అంటూ ప్రచారం చేసినా అబ్బో వద్దు.. ఇల్లు తగలబడిపోతుదంటా.. అని ప్రచారం సాగింది. ఈ ఆరోపణలను చాలావరకు ప్రజలు ఆచరించి ఆచితూచి గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేస్తూ వచ్చారు. నేడు గ్యాస్ సిలిండర్ లేని ఇల్లు లేదు. కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయండి అని ప్రభుత్వాలే సబ్సిడీని అందించాయి. కొన్ని కంపెనీలు తయారు చేసిన ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలు వివిధ సాంకేతిక కారణాలతో తగలబడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. భయపడుతూనే వాహన చోదకులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోల వైపు అడుగులు వేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసి ప్రతి నెలా వేలాది రూపాయాలు వెనక్కి వేసుకోండని ఆయా ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు ప్రకటనలు చేస్తూ వాహనచోదకులను ఆకర్షింపజేస్తున్నాయి. దీంతో ఆ దిశగా వాహనాలు కొనుగోలు చేస్తున్నారు.
ముమ్మరంగా కొనుగోళ్లు
ప్రస్తుతం మార్కెట్లో పెరిగిన ఇంధన ధరల నుంచి ఉపశమనం పొందేందుకుగానూ తక్కువ ఖర్చుతో ప్రయాణాలను కొనసాగించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి పెంచుకుంటున్నారు. ఈ తరుణంలో ఎలక్ట్రిక్ కార్లతోపాటు లగేజీ వాహనాలను, ద్విచక్రవాహనాల కొనుగోలుకు వివిధ కంపెనీల షోరూంలను సంప్రదిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల పనితీరుపై ఆరా తీస్తున్నారు. ఆటో ఆప్పీ కంపెనీతోపాటు వివిధ కంపెనీలు త్రిచక్ర లగేజీ వాహనం కనీసం రూ.3.60లక్షలతోపాటు ఆపై ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ద్విచక్రవాహనాలు వివిధ కంపెనీల్లో రూ.70 వేల నుంచి లక్షల రూపాయల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. కార్లు, బస్సులు కూడా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ప్రత్యక్షమవడంతో వాహన చోదకులు ఎంతో ఉత్సాహం కనబరుస్తున్నారు.
100కిలోమీటర్ల మైలేజ్
ఎలక్ట్రిక్ ఆటోను మార్కెట్లో వివిధ సామగ్రి వేసుకొని తిరుగుతున్నాను. నాలుగు గంటల సమయం వరకు చార్జింగ్ పెడితే దాదాపు 100కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ఇంతకంటే ఏం కావాలి. ఎలాంటి ఆయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వాహనాల వినియోగం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రతిఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు.
-ఖలీల్ఖాన్, ఎలక్ట్రిక్ వాహనచోదకుడు, మహబూబ్నగర్
అలసట రాదు
ఎలక్ట్రిక్ వాహనం నడిపేటప్పుడు ఎలాంటి అలసట రావడం లేదు. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గేర్లు తదితర సమస్యలు ఏమీ లేవు. నాలుగు నెలల నుంచి ఈ వాహనం నడుపుతున్నాను. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా చాలా ఉపయోగకరంగా ఉంది. ప్రతిరోజూ 80కిలోమీటర్లు తిరుగుతున్నాను. ఎలాంటి ఇబ్బంది లేదు.
– జగదీశ్, ఎలక్ట్రిక్ వాహనచోదకుడు, మహబూబ్నగర్