మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి 6: ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తానని జోగుళాంబ జోన్ డీఐజీ లాల్శంకర్ చౌహాన్ అన్నారు. శుక్రవారం అలంపూర్లోని జోగుళాంబ అమ్మవారి దర్శనం అనంతరం మహబూబ్నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబర్లో డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఉమ్మడి జిల్లాల ఎస్పీలు స్వాగతం పలికారు. ఎస్పీలతో డీఐజీ మాట్లాడుతూ ఆయా జిల్లాల్లోని పరిస్థితులను, వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం డీఐజీ మాట్లాడుతూ జోగుళాంబ జోన్లో ఐదు జిల్లాలపై పర్యవేక్షణ ఉంటుందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూస్తానని తెలిపారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ ఐదు జిల్లాల్లో నేరాలు, శాంతిభద్రతల సమస్యలు తక్కువగా ఉన్నాయన్నారు. హోంగార్డు నుంచి ఎస్పీ వరకు వారికి సంబంధించిన సంక్షేమానికి, సర్వీస్ విషయాలు, బెనిఫిట్స్పై త్వరగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వం, డీజీపీ ఆదేశాలను పాటిస్తానన్నారు. ఉమ్మడి జిల్లాలో 81పోలీస్స్టేషన్లు ఉన్నాయని, ఐదుగురు ఎస్పీలు ఉన్నారని, వారితో కలిసి ప్రజలకు మెరుగైన సేవలందిస్తానని డీఐజీ అన్నారు.
అంతకుముందు మహబూబ్నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు, నాగర్కర్నూల్ ఎస్పీ మనోహర్, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, గద్వాల ఎస్పీ రంజన్ రతన్కుమార్, ఏఆర్ ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని పోలీస్స్టేషన్లలో పనితీరు, ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు, కానిస్టేబుల్ సిబ్బంది మూడు నెలల్లో అంతా సక్రమంగా విధులు నిర్వర్తించుకోవాలని ఆదేశించారు. ఇక్కడి నుంచే తన కార్యకలాపాలు ఉంటాయని, ఎవరైనా పనితీరుపై ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటానని, శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూసుకోవాలన్నారు. ప్రజలకు పోలీసులు మెరుగైన సేవలందించాలని డీఐజీ అన్నారు.
అలంపూర్, జనవరి 6: అలంపూర్ క్షేత్రంలోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను జోగుళాంబ జోన్ డీఐజీ లాల్శంకర్ చౌహాన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అర్చకులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామిఅమ్మ వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు శేషవస్ర్తాలతో సత్కరించారు. డీఐజీ వెంట గద్వాల డీఎస్పీ రంగస్వామి, అలంపూర్ ఎస్సై శ్రీహరి తదితరులు ఉన్నారు.