గద్వాల టౌన్, డిసెంబర్ 6 : మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా దత్తాత్రేయుడిని పూజిస్తారు. శ్రీపాదవల్లభుడిగా… శ్రీనృసింహ సరస్వతీగా.. శ్రీ మాణిక్య ప్రభుగా.. శ్రీ స్వామి సమర్థగా.. పూజలు అందుకుంటున్న దత్తాత్రేయుడి జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ. దీంతో దత్త మందిరాలు ముస్తాబయ్యాయి. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
సప్తరుషుల్లో అత్రి మహాముని, ఆయన సతీమణి అనసూయ సంతానం కోసం ఋక్ష పర్వతంపై తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. సంతా నం ఇవ్వమని కోరగా.. తాము ముగ్గురం ఒక్క టై జన్మిస్తామని వరమిచ్చారు. త్రిమూర్తి అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. తపస్సు ఫలితంగా మహాముని త్రిమూర్తులు దత్తత కావడంతో ఆ సంతానం దత్తాత్రేయునిగా వెలుగొందుతున్నాడు. దత్తాత్రేయుడిని శుక్ల పూర్ణిమ రోజు దర్శించుకుంటే త్రిమూర్తులను దర్శించుకున్నట్లేనని పురాణాలు చెబుతున్నాయి. సహస్ర నామావళి దత్త గురు చరిత్రను పఠించడంతో సకల పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.
దత్తాత్రేయుడు మూడు తలలు, ఆరు చేతులతో ఉంటాడు. మూడు తలలు త్రిమూర్తులకు సంకేతాలుగా, ఆరు చేతులు శంఖం, చక్రం, త్రిశూ లం, ఢమరుకం, జపమాల, కమండలములు ఉంటాయి. మెడలో రుద్రాక్ష మాలలు యజ్ఞోపవీతం ఉంటాయి. పై రెండు చేతుల్లో ఉన్న శం ఖం, చక్రం విష్ణుమూర్తికి, ఢమరుఖం, త్రిశూ లం శివునికి, జపమాల బ్రహ్మదేవుడికి చిహ్నా లు. వారి వెనుక ఉన గోవు మహాలక్ష్మికి చి హ్నం. అలాగే నాలుగు శునకాలు నాలుగు వేదాలకు సంకేతాలని చెబుతున్నాయి.
మహారుషి అత్రిని, మహాసాద్వి పతివ్రత శిరోమణి అనసూయమ్మ నివాసం ఉన్న ఆశ్రమంపై త్రిమూర్తులు ప్రయాణం సాగిస్తున్నారు. అకస్మాత్తుగా వారి వాహనాలు ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయారని వారి వాహనాలను త్రిమూర్తులు ప్రశ్నించారు. ఇందుకు మహాపతివ్రత నివాసం ఉన్న ఇంటిపై నుంచి పయనించరాదని సూచించారు. ఇందుకు త్రిమూర్తులు మహరుషి అత్రిని ఆయన సతీమణి అనసూయమ్మను పరీక్షించాలని నిర్ణయించారు. నాడు బ్రాహ్మణ రూపంలో ఆశ్రమానికి వచ్చారు. భోజనానికి ఉపక్రమించారు. అయితే మాకు వడ్డించే స్త్రీ ఒంటి మీద నూలు పోగు ఉండకుండా వడ్డించాలని సూచించారు. ఇందుకు అనసూయమ్మ చిరునవ్వుతో అంగీకరించి వడ్డనకు సిద్ధమైంది. లోపలికి వెళ్లి మంత్రాక్షింతలు తీసుకొచ్చి నేను పతివ్రతను అయితే వీరు ముగ్గురూ పసిపిల్లలుగా మారాలని అక్షింతలు చల్లడంతో ముగ్గురూ పసిపిల్లలుగా మారిపోయారు.
భోజన వడ్డనం తర్వాత తిరిగి అక్షింతలు చల్లడంతో బ్రాహ్మణులుగా మారారు. అయితే అనసూయకు చిన్న కోరిక కలిగింది. ముగ్గురిని మరలా శిశువుల్లా మారి ఊయలు కట్టి ఆడించసాగింది. దీంతో త్రిమూర్తులు అనసూయమ్మ ఇంట శిశువుల రూపంలో ఉండిపోయారు. సకల జగత్తు విస్తుపోయింది. త్రిమూర్తులు లేకుండా పాలించేది ఎలా అంటూ దేవతలు, త్రిమూర్తుల సతీమణులను వేడుకున్నారు. దీంతో త్రిమూర్తుల సతీమణులు అనసూయమ్మను తమ భర్తలకు యధారూపం ప్రసాదించాలని వేడుకున్నారు. శిశువుల రూపంలో ఉన్న త్రిమూర్తులపై మళ్లీ అక్షింతలు చల్లడంతో త్రిమూర్తులు యధారూపాన్ని పొందారు. అత్రి, అనసూయమ్మకు భక్తికి మెచ్చిన త్రిముర్తులు వారికి దత్తపుత్రులుగా మారుతున్నట్లు వారికి వారుగా ప్రకటించుకున్నారు. అలా జన్మించనవాడే దత్తాత్రేయుడు. అత్రి, అనుసూయలకు దత్తపుత్రుడిగా జన్మించినందుకు దత్తాత్రేయుడుగా పిలవబడుతూ భక్తులతో పూజలు అందుకుంటున్నాడని ప్రతీతి.
నది అగ్రహారంలోని శ్రీదత్త ఆలయం, శంభునాథ మఠంలోని దత్త ఆలయంతోపాటు వివిధ సాయి మందిరాల్లో బుధ, గురువారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రెండ్రోజులుగా సాయి మందిరంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయి ఆలయంలో సాయిబాబాకు పంచామృతాభిషేకాలు, దత్తహోమంతో పాటు అనఘాదేవి వ్రతం, దత్త హోమం, పల్లకీసేవ, శేజాహారతి ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా దత్త ఆలయాల్లో అనఘాదేవి వ్రతాలు, స్వామికి అభిషేకాలు నిర్వహించేందుకు ఆలయాల నిర్వాహకులు, అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు.