పెద్ద మున్సిపాలిటీలు, మెట్రోపాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు రింగ్ రోడ్డు, బైపాస్లను ఏర్పాటు చేస్తుంటారు. కానీ రెండువేలజనాభా ఉన్న గ్రామానికి బైపాస్ రోడ్డు ఉందంటే మీరు నమ్ముతారా? అది కూడా గ్రామస్తులే సంఘటితమై ఏర్పాటు చేసుకున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ.. అయినా నమ్మాల్సిందే.. ఎందుకంటే అది నిజం కాబట్టి..! ఈ రోడ్డు తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామస్తుల సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తున్నది. – తిమ్మాజిపేట, జూన్ 26
గ్రామంలో ఇటీవల జరిగిన బొడ్రాయి పండుగ సందర్భంగా ప్రజలంతా ఏకమై అద్భుతమైన రోడ్డును నిర్మించారు. మండల సరిహద్దులో చివరి గ్రామంగా ఉన్న చేగుంట ఇటు నాగర్కర్నూల్, అటు వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలకు సరిహద్దుగా ఉంటుంది. మండలం నుంచి అటుగా వెళ్లే వాళ్లకు ఈ గ్రామం గుండా దగ్గరి దారి ఉంది. దీంతో ప్రతి రోజూ ఎన్నో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. గ్రామం నడిబొడ్డు నుంచి రోడ్డు ఉన్నా.. అది ఇరుకుగా, మలుపులతో ఉండటంతో ఇబ్బందులు తలెత్తగా పలుమార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. ఇది గమనించిన గ్రామస్తులు ప్రత్యామ్మాయం ఏంటని ఆలోచిస్తుండగా.. వారికి బైపాస్ రోడ్డు ఆలోచన వచ్చింది. గొరిట నుంచి గ్రామానికి వచ్చే దారిలో పాత(నక్ష) తోవ ఒకటి ఉందని, అది ప్రధాన (మహబూబ్నగర్-నాగర్కర్నూల్) రోడ్డుకు కలుస్తుందని వారు తెలుసుకున్నారు. వెంటనే పనులు ప్రారంభించగా.. గ్రామానికి చెందిన వ్యాపారవేత్త సురేందర్రెడ్డి దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆ తోవ గుండా ఉన్న రైతులను సంప్రదించి బైపాస్ రోడ్డు నిర్మాణానికి సహకరించాలని కోరుతూ.. ఆర్థికంగా రోడ్డు కోసం ఖర్చు చేశారు. అటుగా ఉన్న ఒక కోళ్ల పరిశ్రమ యజమానులను సంప్రదించగా వారు కూడా కొంత సహకరించడంతో రోడ్డుపనులు ప్రారంభించారు. దాదాపు 3 కిలోమీటర్ల మట్టిరోడ్డును నెల వ్యవధిలో పూర్తి చేశారు. రోడ్డును చదును చేసి, అద్దంలా మార్చారు. ప్రస్తుతం గ్రామంలోకి వెళ్లకుండా ప్రధాన రోడ్డుకు చేరుకునేలా దాదాపు 20 నుంచి 30 అడుగుల వెడల్పులో రోడ్డును ఏర్పాటు చేశారు. దీంతో చాలా వాహనాలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్నాయి. బైపాస్ రోడ్డు ఏర్పాటుపై గ్రామస్తులతోపాటు వాహనదారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బైపాస్ రోడ్డుతో చాలా ఉపయోగాలున్నాయి. గ్రామంలో ఇరుకు రోడ్డు ఉండటంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉండేవి. బైపాస్ ఏర్పాటయ్యాక ఆ సమస్య తీరింది. గొరిట నుంచి వ చ్చే వారంతా గ్రామంలోకి రాకుండా బైపాస్ మీదుగా వెళ్తున్నారు. దీంతో మాకు, వాహనదారులకు ఇబ్బందులు తప్పాయి. అదేవిధం గా అటుగా పొలాలున్న రైతులకు కూడా ఈ రోడ్డు ప్రయోజనకరంగా మారింది. బిజినేప ల్లి, నాగర్కర్నూల్ వెళ్లే వారికి దూరం తగ్గుతుంది. – చెన్నయ్య, చేగుంట
బైపాస్ రోడ్డు ఏర్పాటుతో భారీ వాహనాలకు ఇబ్బందులు తప్పాయి. అదేవిధంగా గ్రామంలో రద్దీ కూడా తగ్గింది. గ్రామం మీదుగా భూత్పూర్, బిజినేపల్లి వైపు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇప్పటివరకు గ్రామ నడిబోడ్డు నుంచి రోడ్డు ఉండటంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. బైపాస్ రోడ్డు ఏర్పాటుతో పరిష్కారం లభించింది. రైతులు పొలాలకు వెళ్లేందుకు కూడా రోడ్డు వచ్చింది. భవిష్యత్తులో ఈ రోడ్డును బీటీగా మార్చితే మరింత బాగుంటుంది.