మూసాపేట, మే 19 : అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఇండ్లు రాని వారు నిరాశ పడొద్దని, విడుతల వారీగా అందజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా మూసాపేట తాసిల్దార్ కార్యాలయంలో దేవరకద్ర ఎమ్మెల్యే సమక్షంలో డబుల్ బెడ్రూం ఇండ్లకు లక్కీడిప్ ద్వారా కేటాయింపులు జరిగాయి.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. తెలంగాణ మలిదశ ఉద్యమం నాటి నుంచి జానంపేట గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నదన్నారు. రాష్ట్రం ఏర్పడ ముందే ఈ గ్రామంలోని జాతీయ రహదారిపై తెలంగాణ రాష్ట్రం బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమ స్ఫూర్తిని స్థానికులు చాటారని గుర్తు చేశారు. జానంపేట గ్రామం మొత్తం ఐక్యతతో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తుండడంతో ప్రత్యేకంగా ఇండ్లను కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని చెప్పారు. మంచి చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలని సూచించారు. ఇప్పటికే కర్వెన రిజర్వాయర్ పూర్తయ్యేదని, కానీ మన ప్రాంత నాయకులే కోర్టుల్లో కేసులు వేసి పనులు నిలిపివేయించారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి ఇండ్ల లబ్ధిదారులు పాదాభివందనాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.