అచ్చంపేట : అచ్చంపేట పట్టణంలో జరుగుతున్న పదవ తరగతి ( Tenth ) పరీక్షలు ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ (DEO Ramesh Kumar ) సూచించారు. అచ్చంపేట పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, శ్రీ చైతన్య, శ్రీ కాకతీయ పాఠశాలల్లో జరుగుతున్న పరీక్షా కేంద్రాల్లో పదవ తరగతి హిందీ( Hindi ) పరీక్షల నిర్వహణ తీరును శనివారం ఆయన స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసు కున్నారు. ప్రశ్నపత్రాల రికార్డులను పరిశీలించడంతో పాటు, పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల ఏర్పాట్లు, వైద్య సహాయ శిబిరాల ఏర్పాటు తదితర అంశాలను సమీక్షించారు. పరీక్షా హాలులో నిరంతర విద్యుత్ సరఫరా( Power Supply) , ఫ్యాన్లు, తగినంత వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని, వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థులు అస్వస్థతకు గురైతే వెంటనే వైద్య సహాయం అందించేందుకు ఓఆర్ఎస్, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లను అనుమతించరాదని స్పష్టం చేశారు. ఎలాంటి మాల్ప్రాక్టీస్కు అవకాశం లేకుండా పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
హిందీ పరీక్షకు 10,527 మంది హాజరు
జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి రెండో రోజు పరీక్షలకు 10,551 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 10,527 మంది విద్యార్థులు 99.77 శాతం నమోదైనట్లు డీఈఓ తెలిపారు. హిందీ పరీక్షకు 24 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఆయన వెంట అచ్చంపేట మండల విద్యాధికారి జీవన్ కుమార్, టీచర్ రఘు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.