గిరిజన రైతుల్లో ‘పోడు’ సంబురం నెలకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు హక్కు పత్రాల పంపిణీకి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టగా.. అచ్చంపేటలో కలెక్టర్ ఉదయ్కుమార్, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారితో కలిసి ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పట్టాలు పంపిణీ చేశారు. శుక్రవారం 11 మంది రైతులకు పంపిణీ చేసి కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించగా.. పోడు రైతులు పట్టాల పండుగ జరుపుకొ న్నారు. రాష్ట్రంలోని గిరిజనులకు స్వర్ణయుగం వచ్చిందని విప్ పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో 1200 మందికిగానూ 3వేల ఎకరాల భూమికి సంబంధించి పత్రాలు అందజేస్తామన్నారు. పోడుపట్టాల పేరున ఎవరైనా డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. దశాబ్దాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించి మా జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటామని రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
– అచ్చంపేట, జూన్ 30
అచ్చంపేట, జూన్ 30: గిరిజనుల దశాబ్దాల కల అయిన పోడు సమస్యకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించి వారికి స్వర్ణయుగం కల్పించిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. అచ్చంపేటలోని షామ్స్ ఫంక్షన్హాల్లో నియోజకవర్గంలోని అర్హులకు పోడు భూముల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ ఉదయ్కుమార్, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారితో కలిసి ఆయన రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా సాగుచేసుకుంటున్న భూమి చట్టపరంగా వారికి దక్కదని.. అటవీశాఖ అధికారుల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ప్రభుత్వం పోడు భూములకు సైతం నేడు పట్టాలు అందజేసి హక్కులు కల్పించిందన్నారు. 75 ఏండ్లుగా అడవిలో జీవిస్తూ భూమిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలకు ప్రతి ఏటా సాగుచేసే సమయంలో అటవీశాఖ అధికారులతో ఇబ్బందులు పడేవారు.
జిల్లాలో 1,200మందికి 3వేల ఎకరాల భూమికి అటవీహక్కుల భూమిపత్రాలు అందిస్తున్నట్లు చెప్పారు. తన పుట్టినరోజున గిరిజనుల కు పోడుభూముల పట్టాలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. భూమినే నమ్ముకొని బతుకున్న గిరిజనులు చిన్న చిన్న కారణాల వల్ల బాధపడుతున్న విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అందరికీ పట్టాలు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు. పట్టాలు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బక్కలింగాయపల్లి, అక్కారం, లక్ష్మాపూర్, దండ్యాలతండా, చెన్నంపల్లి ఇతర గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించి, గిరిజనులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పోడుపట్టాల పేరున ఎవరైనా డబ్బులు అడిగితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆశించిన స్థాయిలో పనులు జరుగలేదని, తెలంగాణ ఏర్పడ్డాక సమాజంలోని అన్ని కులాలు, వృత్తులవారికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు.
అనంతరం కలెక్టర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ ఆర్వోఆర్ చట్టం ప్రకారం జిల్లాలో 2వేల మందికి దాదాపు ఐదువేల ఎకరాలకు సంబంధించిన పోడు పట్టాలు అందజేస్తున్నామనారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇంతపెద్ద మొత్తంలో పోడు పట్టాలు పంపిణీ చేయడం ఇదే మొదటిసారి అని గుర్తు చేశారు. పోడు పట్టాలు పొందిన వారికి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా హద్దులు నిర్ణయించి గూగుల్ మ్యాప్లో హద్దులు చూయించి పట్టాలు తయారు చేశామని వివరించారు. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్ మాట్లాడుతూ నేడు పోడు పట్టాలు పొందిన రైతులకు రైతుబంధు, రైతుబీమా వర్తిస్తుందన్నారు. అంతకుముందు సాయిచంద్ మృతికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎఫ్డీ విశాల్, డీటీడీవో కమలాకర్, ఆర్డీవో పాండూనాయక్, తాసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.