నాగర్కర్నూల్ టౌన్/ బిజినేపల్లి/ కొల్లాపూర్, డిసెంబర్ 17: జిల్లా కేంద్రంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆదివారం ధనుర్మాస ప్రత్యేక పూజలు తెల్లవారుజామున ప్రారంభమైనట్లు ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. ఆదివారం నాడు తెల్లవారుజామున ఐదు గంటలకు సప్రభాత సేవా కార్యక్రమాన్ని వేద మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు. గోదాదేవి అమ్మవారి తిరువారాధన, తిరుప్పావై, పఠనం, బ్రాహ్మణ అర్చక బృందం శాస్ర్తోక్తంగా పఠించారు. పాశర విశిష్టత తెలియజేస్తూ 30రోజుల పాటు గోదాదేవి అమ్మవారి పాశురాలు విన్న ఆ మహిళలకు సుగుణవంతుడైన భర్తతో కల్యాణం జరుగనున్నట్లు తెలిపారు. భక్తులు అమ్మవారికి తమ ఇంటి ఆవరణలో పూసిన వివిధ రకాల పూలను నిత్యం ఆలయంలో సమర్పించాలని సూచించారు. జనవరి 16వరకు ప్రతిరోజు పూజలు జరుగుతాయన్నారు. ఈనెల 23న వైకుంఠ ఏకాదశిప్రత్యేక పూజలు ఉన్నాయని తెలిపారు. సత్యసాయి సేవా సమితి యువత ఆధ్వర్యంలో గోదాదేవి నామ సంకీర్తన, భజనలు, కీర్తనలు భక్తిశ్రద్ధలతో చేశారు. దత్తాత్రేయ స్వామి, సూర్యనారాయణ, జంటనాగులను భక్తులు దర్శించుకున్నారు. బిల్వ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కార్యక్రమంలో రామాలయ నిత్య విష్ణు సహస్త్ర పారాయణ కమిటీ సభ్యులు, అర్చకులు శ్రీనివాసాచార్యులు, మురళి మోహనాచార్యులు, కరుణశ్రీ, రాధ, పద్మ, భక్తులు పాల్గొన్నారు.
బిజినేపల్లి మండలంలోని పాలెం, వట్టెం గ్రామాల్లోని వేంకటేశ్వర స్వా మి ఆలయాల్లో ఆదివారం ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెల్ల్లవారుజామునే స్వామి వారికి పంచామృతాలతో అర్చనలు, అభిషేకాలు చేశారు. ప్రతి ఏటిలాగే ఈసారి నెలపాటు ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
కొల్లాపూర్ పట్టణంలోని కోదండ రామస్వామి సన్నిధిలో ఆదివారం తెల్లవారుజామున ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు ప్రతిరోజు తెల్లవారుజామున దివ్య తిరుప్పావై సేవలు మొదలుకొని, వచ్చే నెల 15వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. చలిలోనూ, పిల్లలు, పెద్దలు రామాలయానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో భజనలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.