అలంపూర్, ఫిబ్రవరి 14 : ఐదో శక్తిపీఠమైన అలంపూర్ క్షేత్రంలో ఐదు రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి ఉభయ ఆలయాల్లో పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఎలాంటి అలంకరణ లేకుండా జోగుళాంబ దేవి నిజరూపంలో భక్తులు దర్శనమిచ్చింది. అమ్మల గన్న అమ్మ.. జగజ్జననీ పాహిమాం.. పాహిమాం.. మమ్మల్ని చల్లంగా చూడమ్మా అంటూ వేడుకున్నారు. కొందరు పూనకాలతో ఊగిపోయారు. 1108 కలశాలతో అభిషేకాలు, పూజలు జరిపించారు. ఆలయ కమిటీ చైర్మన్ చిన్న కృ ష్ణయ్యనాయుడు, ఆలయ ఈవో పురేందర్కుమార్ ఆ ధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన గ్రామోత్సవం అలరించింది. జోగుళాంబ సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ, ఉపాధ్యక్షుడు బండారు బాబు, గౌరవ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ సొంత ఖర్చుతో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతం నుంచి కళాకారులను తీసుకొచ్చారు. గ్రామ దేవతల వేషధారణలో నిర్వహించిన ఊరేగింపు అలరించింది. తుంగభద్ర నదీ తీరంలోని హరిశ్చంద్ర ఘాట్లో వెలిసిన ఘంటలేశ్వరాలయం నుంచి ఊరేగింపు మొదలై జోగుళాంబ ఆలయం వరకు చేరుకున్నది. అలాగే జోగుళాం బాబాలబ్రహ్మేశ్వరస్వామి కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే విజయుడు పాల్గొని పూజలు చేశారు.