ఊటూర్, మే 12 : ఎకరాకు రూ.60 లక్షలు చెల్లించాలని, కోల్పోయే భూమికి బదులు మరోచోట భూము లు కొనుగోలు చేసి ఇవ్వాలని, అలాగే కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు డిమాండ్ చేశారు. ఎత్తిపోతలలో భాగంగా భూసేకరణ సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో సోమవారం నారాయణపేట ఆర్డీవో రాంచందర్ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. ఊటూర్ మండలం బాపురం, తిప్రాస్పల్లి, పులిమామిడి, జీర్ణహళ్లి, పెద్దపొర్ల గ్రామాల్లోని సభలకు సంబంధిత శాఖాధికారులు హాజరయ్యారు. ముందు గా ఓపెన్ కెనాల్, పైపులైన్, సంప్హౌస్, విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాల్లో భూములు కోల్పోయే రైతుల వివరాలను గ్రామసభలో చదివి వినిపించారు. ఈ సందర్భం గా ఆర్డీవో మాట్లాడుతూ ఎత్తిపోతల్లో భాగంగా భూత్పూర్ రిజర్వాయర్ ద్వారా ఊటూర్ పెద్ద చెరువు, నారాయణపేట మండలం పేరపళ్ల జాయమ్మ చెరువుకు సాగునీరు అందించేందుకు సర్వే పూర్తి చేశామని తెలిపారు.
సర్వేపై రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భా గంగా భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం అం దించి ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వే పూర్తి చేయడంతో కొలతల్లో తేడాలు ఉన్నాయని, రీ సర్వే చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సర్వే పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా పరిహారం చెల్లింపు విషయాన్ని ప్రభుత్వం చెప్పడం లేదని, మరో నెల రోజు ల్లో వానకాలం పంట సాగుకు పొలాలను సిద్ధం చేయాల్సి ఉందన్నారు. అధికారులు భూ సేకరణ చేపడితే పెట్టుబడులు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో తాసీల్దార్ చింత రవి, ఇరిగేషన్ ఫేజ్ -1, ఫేజ్-2 డీఈలు చేతన్, వెంకటరమణ, ఏఈఈ సురేశ్, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్రారెడ్డి, ఆర్ఐ, ఏవో పాల్గొన్నారు.